శుక్రవారం, మార్చి 17, 2017

ఆడలేక ....

మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడో కొత్త పల్లవి అందుకున్నాయి. వాటి ఓటమికి కారణం ఓటర్లు కాదు, ఈవీఎంలు గా పిలవబడే ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషిన్లు అని. ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు బ్యాలట్ ద్వారా కాక ఈవీఎంల ద్వారానే జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజీరిటీ సాధించి, మరో రెండు రాష్ట్రాల్లో అక్కడి రాజకీయ పరిణామాలని తనకి అనుకూలంగా మలుచుకునీ, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోంది. ఓటమి పొందిన పార్టీలు, ఆయా నాయకుల అనుయాయులు ఇప్పుడు బీజీపీ గెలుపుని ఈవీఎంలకి ఆపాదిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈవీఎంలని ట్యాపరింగ్ చేయడం ద్వారా వోట్లని తనకి అనుకూలంగా మార్చేసుకుని ఎన్నికల్లో గెలిచేసిందన్నది ప్రధాన అభియోగం.

భారతీయ ఎన్నికల వ్యవస్థలోకి ఈవీయంలు అడుగుపెట్టి సరిగ్గా ముప్ఫయి ఐదు సంవత్సరాలు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈవీఎంలని తయారు చేస్తున్న భారతదేశం, ప్రస్తుతం ఈ మిషిన్లని పొరుగునే ఉన్న చిన్న దేశాలకి ఎగుమతి చేస్తోంది కూడా. కేరళలో 1982 లో జరిగిన ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా మొదటి సారి ఎంపిక చేసిన వోటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల వినియోగం అమలయ్యింది. అదిమొదలు విడతలు విడతలుగా ఈవీఎంలని పెంచుకుంటూ వచ్చి 2014 పార్లమెంట్ ఎన్నికల నాటికి దేశం మొత్తంలో ఎన్నికల ప్రక్రియని ఈవీఎంల ద్వారా జరిపారు. మునుపు ఉన్న బ్యాలట్ పేపర్ పద్ధతితో పోల్చినప్పుడు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సులభం, సమయం, నిర్వహణ వ్యయంతో పాటు టన్నుల కొద్దీ కాగితాన్నీ పొదుపు చేస్తుంది.

ఈవీఎంల వాడకం మొదలయ్యే నాటికి దేశంలో అక్షరాస్యత శాతం కేవలం నలభై శాతం. అలాగే గ్రామాల విద్యుదీకరణ లాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడే ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంలో భారతదేశానికి సరిపడవన్నది అప్పట్లో వినిపించిన ప్రధాన విమర్శ. రాను రాను అక్షరాస్యతా శాతం, గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు, విద్యుత్ సరఫరా లాంటి కనీస సౌకర్యాలు మెరుగు పడడం ఒకపక్క, ఈవీఎం డిజైన్లలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి, కేవలం బ్యాటరీ ఆధారంగా పనిచేసే డిజైన్లు విజవంతంగా పనిచేయడం మరో వంక జరగడం, వీటన్నింటిని మించి గత శతాబ్దపు తొంభయ్యో దశకం నుంచీ ఎన్నికల సంస్కరణల మీద దృష్టి పెట్టిన భారత ఎన్నికల సంఘం ఈవీఎంల విషయంలో పట్టుదలగా ఉండడం వల్లా ఎన్నికల నిర్వహణలో సమూలమైన మార్పు చోటుచేసుకుంది.

రాజకీయ పార్టీలకీ, వోటర్లకీ ఈవీఎంల పనితీరు మీద నమ్మకం కలిగించడానికి ఎన్నికల సంఘం విశేషమైన ప్రయత్నం చేసింది. ఈవీఎంల వినియోగం విస్తృతమయ్యాక, ఒకప్పుడు ఏ నిరక్షరాస్యులు ఈవీఎంలని వినియోగించలేరని రాజకీయ పార్టీలు వాదించాయో, అదే నిరక్షరాస్యులు బ్యాలట్ కన్నా మెరుగ్గా ఈవీఎంల ద్వారా తమ వోటుని నమోదు చేసుకోవడంతో నిరక్షరాస్యత అన్నది వాదనకి నిలవలేదు. ఏ లక్ష్యాల్ని సాధించడం కోసం ఈవీఎం ల వినియోగం మొదలయ్యిందో, అవి నెరవేరడం ఆరంభమయ్యింది. పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేయడం, బ్యాలట్ బాక్సుల్లో సిరా పోయడం, బాక్సుల్ని ఎత్తుకుపోవడం లాంటి దృశ్యాలన్నీ ఎన్నికల రంగం నుంచి క్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. మరోపక్క కౌంటింగ్ ప్రక్రియ బాగా వేగవంతమయ్యి, తొలి రెండు మూడు గంటల్లోనే ఫలితాలు వెల్లడవుటున్నాయి.

ఇదంతా నాణేనికి ఒకవైపు. ఇక రెండో వైపున విమర్శల పర్వం. అది ఎప్పటిలాగే కొనసాగుతోంది. ఒకప్పుడు ఎన్నికల్లో అధికార పక్షం ఓడిపోతే 'ప్రతిపక్షాల కుట్ర' అనీ, ప్రతిపక్షం ఓటమి పాలైతే 'అధికార పక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడింది' అనీ విమర్శలు వినిపించేవి. ఇప్పుడా విమర్శలు ఈవీఎంల వైపు మళ్ళాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిపక్షాలు ఈవీఎం ల పని తీరు మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. "ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసింది మేమే" అని బోర విరుచుకునే నాయకులు కూడా ఈవీఎం ల పనితీరుని అనుమానించేందుకు వెనకడుగు వేయకపోవడం విశేషం. అధికార పక్షం తన అధికారాన్ని ఉపయోగించి ఈవీఎంలలో నమోదైన వోట్లని తారుమారు చేసిందన్న విమర్శలో పస ఎంత?

వోటింగ్ పూర్తైన వెంటనే ఈవీఎంలకు సీలు వేసిన బూత్ స్థాయి అధికారులు వాటిని జిల్లా స్థాయి అధికారులకి అప్పగిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్ధులందరి సమక్షంలో సీల్ పర్యవేక్షణ ముగిసిన అనంతరం, ఈవీఎంలని గోడౌన్ లో భద్రపరుస్తారు. ఈ గోడౌన్ దగ్గర గట్టి భద్రత ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఏ క్షణంలో అయినా గోడౌన్లని తనిఖీ చేయవచ్చు. ఇక, కౌంటింగ్ సమయంలో కూడా అందరు అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఈవీఎంల సీలు విప్పి ఫలితం ప్రకటిస్తారు. సీలు విషయంలో అభ్యర్ధికి ఏ సందేహం ఉన్నా వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు.

ఇంతటి భద్రతా వలయంలో ఉండే ఈవీఎంలలో ఉన్న ఓట్లని రాత్రికి రాత్రి తారుమారు చేయడం అన్నది సాధ్యమయ్యే పనేనా? ఒక్కో బూత్ కి ఒక్కో ఈవీఎం చొప్పున చూసుకున్నా, మొత్తం ఎన్ని ఈవీఎంలలో ఓట్లు మారిస్తే ఫలితం మారుతుంది? ఈ మొత్తం మార్పుకి ఎంత సమయం పడుతుంది? అంతసేపు పోటీలో ఉన్న అభ్యర్థులు, వాళ్ళ ప్రతినిధులు, గోడౌన్ల మీద నిఘా పెట్టకుండా ఊరుకుంటారా? ఈ మొత్తం ట్యాపరింగ్ కి ఎలాంటి టెక్నాలజీ కావాలి? ఎందరు టెక్నీషియన్లు కావాలి? ఇలాంటిదేదో జరుగుతూ ఉంటే బ్రేకింగ్ న్యూస్ కోసం ఆవురావురనే మీడియా చూస్తూ ఊరుకుంటుందా? ఈ ప్రశ్నల్లో ఏ కొన్నింటికి జవాబులు దొరికినా, ఓడిన వారు ఈవీఎంల మీద చేస్తున్న విమర్శలని గురించి ఆలోచించవచ్చు. లేనిపక్షంలో ఓటమి తాలూకు బాధలో ఏదో మాట్లాడుతున్నారు లెమ్మని వదిలేయవచ్చు.

1 కామెంట్‌:

  1. Well said.

    Around 7 to 8 years back the so called opposition parties at that time and the current ruling parties raised a similar issue.

    Our (people) stand depends on whom we are supporting ;)

    రిప్లయితొలగించండి