సోమవారం, నవంబర్ 21, 2016

మాబడి

అల్లప్పుడెప్పుడో పందొమ్మిదివందలో సంవత్సరంలో బళ్ళో చదువుకున్న ఒకాయన, ఆతర్వాత యాభై ఏళ్ళకి బాగా పెద్దయిపోయాక ఆ జ్ఞాపకాలన్నీ పుస్తకంగా రాసుకుని ప్రచురించుకున్నారు.. నాటి (నేటికీ) సాహితీ పెద్దమనుషులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు ముందుమాట రాసి ఆశీర్వదించిన ఆ పుస్తకం లైబ్రరీల్లో చెదపురుగుల బారిన పడిపోయేదే, మోదుగుల రవికృష్ణ అనే సాహిత్యాభిమాని కంట పడకుండా ఉండి ఉంటే. తెలుగు సాహిత్యం, అందునా ఆధునిక యుగం తొలినాటి రచనలంటే ప్రత్యేకాభిమానం ఉన్న రవికృష్ణ ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా రక్షించడమే కాకుండా తన మిత్రుల సాయంతో మళ్ళీ ప్రచురించి మార్కెట్లో విడుదల చేశారు. ఆ పుస్తకంతో తన అనుభవాలు మరియు శ్రీరమణ రాసిన తాజా తాజా ముందుమాటలో సహా.. ఆ పుస్తకం పేరే 'మాబడి.'

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ వాసి తెన్నేటి కోదండరామయ్య రాసిన నాటి 'మాబడి' ని నేడు చదవాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకి జవాబు వెతుక్కుంటే చాలు, ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటో అర్ధమవ్వడానికి. తరాలు మారిపోయినా, సాంకేతిక పరిజ్ఞానం బోల్డంత అభివృద్ధి చెందిపోయినా నాటికీ నేటికీ మారనివాటిలో మొదట చెప్పుకోవాల్సింది చిన్న పిల్లలు బడికి వెళ్లడం. ఇప్పటివాళ్ల సంగతెలా ఉన్నా, అప్పటివాళ్ళు ఎలిమెంటరీ స్కూలు చదువు ఆడుతూ పాడుతూ ముగించి, హైస్కూలు చదువుతుతో పాటు లోకజ్ఞానాన్నీ గ్రహించే వాళ్ళన్న విషయంతో పాటు, సదరు జ్ఞాన సముపార్జన కోసం జరిగిన ఏర్పాట్లు తెలుసుకోవచ్చు.

ఇప్పటి విద్యాలయాల్లో జరిగేవి ఒకరకం రాజకీయాలైతే, నాటి బళ్ళలో జరిగినవి మరో రకం రాజకీయాలనీ, రాజకీయం తగుమాత్రంగా రూపం మార్చుకుంది తప్ప స్కూళ్ళని పట్టి పీడించడం మానలేదనీ అర్ధమవుతుంది. పిల్లలకి కొందరు మేష్టర్ల మీద విశేషించి అభిమానం ఉండడం, మరికొందరంటే అస్సలు పడక పోవడం, అదేవిధంగా ఒక మేష్టారికి అనుకూల, ప్రతికూల వర్గాలు, వాటి మధ్య గొడవలు ఆనాడూ ఉన్నాయని బోధ పడుతుంది. నేటి చదువులతో పాటు, ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా టీచర్ల నిర్ణయం మేరకే జరుగుతూ ఉండగా, నాడు సదరు యాక్టివిటీస్ బాధ్యత పూర్తిగా పిల్లలదే అని, అవసరమైతే మేష్టర్లు సాయం చేసేవాళ్ళే తప్ప పెత్తనం ఏమాత్రం చేసేవారు కాదన్న సత్యం ద్యోతకమవుతుంది.


పిల్లల చదువుల విషయంలో కొందరు తల్లిదండ్రుల భయంకర పట్టుదల ఇప్పటి తరానికి మాత్రమే ప్రత్యేకం కాదనీ, వందేళ్ల నాటి పరిస్థితి కూడా అంతేననీ తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటివి ఇంకా అనేకం కనిపించి అనేకానేక భావాలు కలిగిస్తాయి పాఠకుల్లో. తణుకు బోర్డు స్కూల్లో చదువుకున్న కోదండరామయ్య గారికి బడన్నా, హెడ్మాస్టారన్నా విపరీతమైన భక్తీ, గౌరవమూను. రెండు భాగాలుగా విభజించిన ఈ పుస్తకంలో మొదటిభాగం హెడ్మాస్టారి గొప్పదనాన్ని వైనవైనాలుగా వర్ణించారు. నాటి యూనియన్ బోర్డు ప్రెసిడెంటుకి హెడ్మాస్టారి మీద కినుక కలగడం, ఆయన్ని బదిలీ చేయించడం కోసం ప్రయత్నించి ఓడిపోవడంతో తొలిభాగం ముగుస్తుంది. హెడ్మాస్టారి కోసం ఊరు మొత్తం రెండుగా విడిపోవడం, అందరూ పనులు మానుకుని ఆయనకి సాయం చేయడమో, వ్యతిరేకంగా నిలబడ్డమో తప్ప తటస్థులెవరూ లేకపోవడం లాంటివి అతిశయోక్తుల్లా ధ్వనిస్తాయి.

ఇక పుస్తకంలో రెండో భాగం, స్కూలు విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న నాటక సమాజాన్ని గురించి. మొదటిభాగం కొంచం గంభీరంగా సాగితే, ద్వితీయ భాగం ఆసాంతమూ నవ్వులు పూయిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నవ్వకుండా పేజీ తిప్పడం అసాధ్యం. మొదటి భాగంలో 'బాలుని సముద్ర వర్ణన,' కోర్టు కేసులో సాక్ష్యాలు లాంటి సంఘటనలు నవ్వించినా అందులో నిజమెంత, అతిశయోక్తి పాలెంత అన్న సందేహం పీడిస్తూ ఉంటుంది. రెండో భాగంలో అలాంటి శషభిషలని తావులేదు. నవ్వగలిగినంత నవ్వుకోవచ్చు. నారదుడు, అర్జునుడు, శివుడు, సుభద్ర పాత్రలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వుకోకుండా ఉండడం అసాధ్యం. హెడ్మాస్టారితో సమంగా రచయితకి ఆరాధనీయుడు 'కృష్ణుడు' అనే సహవిద్యార్థి. ఇతణ్ణి మాత్రం రెండు భాగాల్లోనూ ఎత్తుపీట మీదే కూర్చోబెట్టారు.

లా చదువుకున్న కోదండరామయ్య గొప్ప చదువరి అన్న విషయం తొలి పుటల్లోనే తెలిసిపోతుంది. పందొమ్మిదో శతాబ్దపు ఆంగ్ల సాహిత్యం మీదా, రామాయణ, భారత, భాగవతాదుల మీద, తన సమకాలీన సాహిత్యం మీదా సమానమైన పట్టు ఉంది. స్నేహితుడు కృష్ణుడి గురించి చెబుతూ "ఒక్కమాటలో చెప్పాలంటే అడివి బాపిరాజు గారి 'నారాయణరావు' కి పాకెట్ ఎడిషన్ మా కృష్ణుడు" అనడం వెనుక కొంటె తనం తెలియాలంటే బాపిరాజూ, నారాయణరావూ పాఠకులకి కనీస పరిచయం ఉంటే బాగుంటుంది కదా. ఇప్పటికే చెళ్ళపిళ్ళ వారి 'కాశీయాత్ర' లాంటి పుస్తకాలు పునర్ముద్రించి తన అభిరుచి చాటుకున్న రవికృష్ణ, ఈ పుస్తకాన్ని తేవడం ద్వారా విద్యారంగానికి సేవచేశారని చెప్పాలి. సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు అందరూ చదవాల్సిన 'మాబడి' ని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లు తప్పక చదవాలి. (మిత్రమండలి ప్రచురణలు, పేజీలు 280, వెల రూ. 220, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి