మంగళవారం, మే 24, 2016

కుముదిని

ఓ బతికి చెడిన జమీందారీ కుటుంబంలో ఆఖరి ఆడపిల్ల కుముదిని. ఆమెకి సంగీత సాహిత్యాల్లో చక్కని ప్రవేశం ఉంది. అన్నగారితో సమంగా చదరంగం ఆడుతుంది. ఇక గృహ నిర్వహణ విషయం అయితే చెప్పనవసరం లేదు. చటర్జీ వంశ మర్యాదలకి అనుగుణంగా అతిధులని ఆదరించడంలో ఆమె దిట్ట. తల్లిదండ్రులతో పాటు, ఆస్తుల్నీ కోల్పోయిన ఆమె అన్నల ఎదుట ఉన్న పెద్ద సవాలు కుముదిని వివాహం. వంశ మర్యాదకి తగిన విధంగా ఉన్నత వంశానికి చెందిన వరుడితో ఆమెకి వివాహం జరిపించాలి. కానీ, కుటుంబ ఆర్ధిక పరిస్థితి రీత్యా అది జరిగే పనిగా కనిపించడం లేదు.

ఘోష్ ల వంశానికి చెందిన మధుసూదన ఘోషుడు ముప్ఫై మూడేళ్ళ వాడు. చిన్న స్థాయిలో జీవితాన్ని మొదలు పెట్టి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన అవివాహితుడు. నిజానికి ఘోష్ వంశీకులు జమీందారులు. కొన్ని తరాల క్రితం చటర్జీ వంశీకులకీ, ఘోష్ వంశీకులకీ మధ్య వచ్చిన పట్టింపులు పెరిగి పెద్దవై ఘోష్ లు ఊరు విడిచి వెళ్ళేలా చేశాయి. ఊరు విడిచిన తర్వాత ఘోష్ ల ఆర్ధిక పరిస్థితి దిగజారింది. మధుసూదనుడి తరం వచ్చేసరికి కూలి పనితో తప్ప రోజులు గడవని స్థితి వచ్చేసింది. అయితే, అవినాష ఘోషుడు తెలివైన వాడు, కష్టపడే తత్త్వం ఉన్న వాడు అవ్వడంతో నెమ్మదిగా వ్యాపారం ఆరంభించి పట్టణ ప్రముఖుడిగా ఎదుగుతాడు.

మధుసూదనుడి వివాహం ఇప్పుడా కుటుంబాన్ని పీడిస్తున్న సమస్య. ఇన్నాళ్ళూ సంపాదన మీదే దృష్టి పెట్టి వ్యాపారాలు అభివృద్ధి చేసిన మధుసూదనుడు కూడా పెళ్లి  చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించాడు. అతడు తలచుకుంటే సంబంధాలకేం కొదవ? గొప్ప గొప్ప వాళ్ళు పిల్లనిస్తామంటూ వచ్చారు. కానీ, పెళ్ళికి సంబంధించి మధుసూదనుడి కోరిక ఒక్కటే.. చటర్జీ వంశపు అమ్మాయిని వివాహం చేసుకోవాలని. మధుసూదనుడి అనుయాయులు కన్య కోసం గాలింపు మొదలు పెట్టారు. కుముదిని వాళ్ళ దృష్టిలో పడడం ఆలస్యం, ఇరువైపులా ఒప్పించి సంబంధం ఖాయం చేశారు. ఈ పెళ్ళితో కుముదిని జీవితం ఏ మలుపులు తిరిగిందన్నదే రవీంద్రనాథ్ ఠాగూర్ నవల 'కుముదిని.'


మధుసూదనుడి ఇంట్లో పెద్దకోడలి హోదా కుముదినిది. భర్త కూడా ఆమెని 'పెద్ద కోడలా' అనే పిలుస్తాడు. తనని భక్తిగా చూసే మరిది, తోడికోడలు, గౌరవ మర్యాదలు చూపే పాటక జనం. అయితే, ఆమెకి దొరకనిదల్లా భర్త ఆదరణ. వ్యాపారంలో ఎత్తుకి పై ఎత్తు వేయడంలో అందెవేసిన చేయి అయిన మధుసూదనుడికి స్త్రీలతో వ్యవహారం బొత్తిగా కొత్త. పైగా, అతడు ప్రేమగా మాట్లాడినా అది వ్యాపార లావాదేవీలాగే ఉంటుంది, మాట్లాడే పధ్ధతి వల్ల. ఆ ఇంట్లో తనకే అధికారమూ, స్వతంత్రమూ లేదని త్వరలోనే అర్ధమవుతుంది కుముదినికి. కానీ, భర్తకి ఎదురు చెప్పడం అన్నది ఆమెకి ఏమాత్రం ఇష్టం లేని పని. తల్లి ప్రవర్తన కారణంగా, తండ్రి అనుభవించిన క్షోభని ఆమె మర్చిపోలేదు.

పెళ్లవుతూనే కుముదిని తన పుట్టింటి వాళ్ళతో సంబంధాలని శాశ్వతంగా తెంచేసుకోవాలని ఆశించాడు మధుసూదనుడు. తన అన్నగారు విప్రదాసు అంటే కుముదినికి చెప్పలేనంత ప్రేమ, గౌరవం. పైగా, ఆమె పెళ్లినాటికి విప్రదాసు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. ఏ పని చేస్తున్నా కుముదిని దృష్టి అన్నగారి మీదే ఉండడం మధుసూదనుడికి ఆగ్రహం తెప్పిస్తుంది. ఆమె తననెందుకు ప్రేమించదన్న పట్టుదల పెరుగుతుంది. ఓ పక్క ఆమె తన అన్నకి ఉత్తరం రాసేందుకు కూడా వీలు లేకుండా కట్టడి చేస్తూ, ఆమె ప్రేమని గెలుచుకోడం కోసం విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటాడు. అయితే, ఆ నగల వైపు కన్నెత్తి చూడదు కుముదిని. దీనితో కుముదిని మీద కన్నా ఆమె పుట్టింటి వాళ్ళ మీద కోపం హెచ్చుతుంది మధుసూదనుడికి.

రాను రాను మధుసూదనుడి సాంగత్యం దుర్భరంగా మారిపోతుంది కుముదినికి. ఆమె తనపై ప్రేమ చూపకపోవడం అశాంతికి గురి చేస్తుంది మధుసూదనుడిని. తమ్ముడి సలహా మేరకి, విప్రదాసుని చూసి వచ్చేందుకు పుట్టింటికి పంపుతాడు కుముదినిని. అనారోగ్యంతో క్షీణించిన విప్రదాసుకి కుముదిని పన్నెత్తి చెప్పకపోయినా ఆమె ఇంటి పరిస్థితులు అర్ధమవుతాయి. అప్పటికే పని వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు విని ఉన్నాడతను. ఆధునిక భావాలున్న వాడు, చెల్లెలిని ప్రాణ సమానంగా చూసుకునే వాడూ అయిన విప్రదాసు మధుసూదనుడి ఇంటికి తిరిగి వెళ్ళే విషయాన్ని కుముదిని నిర్ణయానికే వదిలేస్తాడు. జరగబోయే పరిణామాలకి తను జవాబుదారీ అని హామీ ఇస్తాడు. కుముదిని నిర్ణయమే నవలకి ముగింపు.

కమలాసనుడి తెలుగు అనువాదం సాఫీగా సాగిపోయింది. నూరేళ్ళ నాటి బెంగాలీ జమిందారీ వాతావరణంలోకి సులభంగా పాఠకులని ప్రయాణం చేయించేసే నవల ఇది. కొన్ని కొన్ని జమీందారీ పద్ధతులు ఆశ్చర్య పరుస్తాయి. భిన్న ద్రువాలైన కుముదిని, మధుసూదనుడి పాత్రల చిత్రణ ఈ నవలకి ప్రధాన బలం. అక్కడక్కడా కొంత సాగతీత ఉన్నా ఏకబిగిన చదివించే కథనం. తన నవల 'మట్టి మనిషి' లో కొడుకు వెంకటపతి పెళ్లి విషయంలో సాంబయ్య పట్టుదలని చిత్రించడానికి, డాక్టర్ వాసిరెడ్డి సేతాదేవికి స్ఫూర్తి మధుసూదనుడి పాత్రే అయిఉంటుంది అనిపించింది 'కుముదిని' చదువుతూ ఉంటే. (సాహితి ప్రచురణ, పేజీలు  232, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు:

  1. సమీక్ష ఆసక్తి కలిగించేలా ఉందండీ. ముఖ్యంగా మట్టిమనిషిలో నాకు చాలా ఇష్టమైన ఆ సన్నివేశానికి మధుసూదన ఘోషుడు స్పూర్తి అయిఉండచ్చనే పరిశీలన..

    రిప్లయితొలగించండి
  2. @కొత్తావకాయ: చదువుతూండగా 'సాంబయ్య' గుర్తొచ్చాడండీ నాకు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి