శుక్రవారం, మే 20, 2016

సంస్కరణల రథసారథి పి.వి.

గోరంత పని చేసి కొండంత ప్రచారం చేసుకునే రాజకీయ నాయకుల మధ్య, దేశ చరిత్రనే మలుపు తిప్పే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, సమర్ధవంతంగా అమలుజరిపి కూడా "నేనిది చేశాను" అని ఏమాత్రం చెప్పుకోని నాయకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఇవాళ మనం చూస్తున్న సాఫ్ట్వేర్ బూమ్, విదేశీ పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు, అంది పుచ్చుకుంటున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. వీటన్నింటి వెనుకా ఉన్నవి నూతన ఆర్ధిక సంస్కరణలు. పాతికేళ్ళ క్రితం భారతదేశం ఆర్ధిక సంస్కరణలు అమలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుని ఉండనత్తయితే ఇవాల్టి పరిస్థితి మరోవిధంగా ఉండేది.

రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రధాని పదవి చేపెట్టే నాటికి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి, పైగా దక్షిణ భారత దేశానికి చెందిన వ్యక్తిగా పీవీ మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యతిరేకత తక్కువది కాదు. దీనికి తోడు, పూర్తి మెజారిటీ లేని మైనారిటీ ప్రభుత్వం. అదికూడా అనేకానేక చిన్న చిన్న ప్రాంతీయ పార్టీల కలగలుపు. ఆర్ధిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తం. రోజువారీ ఖర్చుల కోసం బంగారం నిలవలని విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బు తేవాల్సిన పరిస్థితి. అంతకు ముందు కొన్నేళ్లుగా సాగిన రాజకీయ అస్థిరత కారణంగా పెట్టుబడులని ఆకర్షించే మార్గాలు ఒక్కొక్కటీ మూసుకు పోవడమే కాదు, ఎన్నారైలు భారతీయ బ్యాంకుల నుంచి డిపాజిట్లు ఉపసంహరించుకున్న సందర్భం అది.

ఈ నేపధ్యంలో, సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టడం వినా మరో ప్రత్యామ్నాయం లేదని నమ్మి, రాగల వ్యతిరేకతని ఊహించి, ఎదుర్కోడానికి మానసికంగా సిద్ధపడి కీలక నిర్ణయాన్ని అమలుపరిచిన ప్రధాని పీవీ. నరసింహారావు ప్రధాని పదవి చేపట్టింది మొదలు, ఆర్ధిక సంస్కరణలు అమలుని పట్టాలెక్కించే వరకూ తెరవెనుక జరిగిన కథా, కమామిషు ఏమిటి? తను తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పీవీ తన టీం ని ఎలా సిద్ధం చేశారు? కీలక వ్యక్తులని ఎలా ఒప్పించారు? సంస్కరణల అమలు క్రమంలో ఎలాంటి ఒత్తిడులని ఎదుర్కొన్నారు? ఈ వివరాలన్నింటితో నాటి టీం సభ్యుడు, నేటి మాజీ మంత్రి జైరామ్ రమేష్ రాసిన పుస్తకమే 'సంస్కరణల రథసారథి పి.వి.'


జూన్ 20, 1991 న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా పీవీ నరసింహారావు ఎన్నికయింది మొదలు, ధరల తగ్గింపు, రూపాయి విలువ తగ్గింపు, వర్తక ప్యాకేజీల ప్రకటన, బంగారం బదిలీలు, విశ్వాస పరీక్ష, నూతన పారిశ్రామిక విధానం పై చర్చ, కీలక ప్రతిపాదనలతో 1991-92 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదన, ప్రణాళికా సంఘం పునర్వ్యవస్తీకరణ, పన్నుల సంస్కరణల ప్రకటన (ఆగస్టు 31) వరకూ జరిగిన అనేకానేక సంఘటనలని వరసక్రమంగా, వీలైనంత సులభంగా వివరిస్తూ రాసిన ఈ పుస్తకం నాటి పరిస్థితులు తెలిసిన వారికి మరింత లోతైన అవగాహనని ఇవ్వడమే కాదు, అప్పుడేం జరిగిందో ఏమాత్రం తెలియని వాళ్లకి కళ్ళకి కట్టినట్టు చూపుతుంది కూడా. సంస్కరణల ఆవశ్యకత మాత్రమే కాదు, సంస్కరణలు ప్రవేశ పెట్టక తప్పని పరిస్థితులు రాడానికి కారణాలని కూడా సులభంగా అర్ధం చేసుకోడానికి ఉపయోగ పడే పుస్తకం ఇది.

రాజీవ్ హత్య అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం, ఆమె పదవిని తిరస్కరించడంతో పీవీని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మొదలు, ఆ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, పీవీ ప్రధాని కావడం, పదవి చేపడుతూనే దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆర్ధికవేత్త మన్మోహన్ సింగ్ ని పిలిచి ఆర్ధిక మంత్రిని చేయడం వంటి సంఘటనలు మొదలుగా, ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టడానికి దారితీసిన పరిస్థితులు, ప్రవేశ పెట్టడంలో జరిగిన తడబాట్లు, రాజకీయ పార్టీల స్పందనలు, పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన స్పందన, పత్రికల్లో జరిగిన చర్చలు.. ఇలా ఒక్కో విషయాన్నీ వివరంగా చెప్పుకుంటూ వెళ్ళారు జైరామ్.

అప్పటివరకూ ప్రధాని కార్యాలయం (పీఎంవో) లో పని చేస్తున్న తనని ఉన్నట్టుండి అక్కడి నుంచి తప్పించడం లాంటి విషయాలని చెబుతూ నాటి పీఎంవో నీ పరిచయం చేశారు. పీవీ-మన్మోహన్ ల ఆలోచనల మధ్య అంతరం, మన్మోహన్ కేవలం ఆర్ధిక అంశాలని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనల వల్ల రాజకీయంగా ఎదురైన ఇబ్బందులు, పార్టీలోనూ, అధికార గణం లోనూ పీవీ వ్యతిరేక శిబిరాలు, తత్ఫలితంగా కలిగిన తలనొప్పులు..ఇవన్నీ జైరామ్ మాత్రమే రాయగలిగిన విషయాలు అనిపిస్తుంది పుస్తకం చదువుతుంటే. మొత్తం పుస్తకాన్ని ఇరవై అధ్యాయాలుగా విభజించడంతో పాటు,  అరుదైన నోట్సునీ నాటి కీలక మీడియా క్లిప్పింగులనీ అనుబంధంగా చేర్చారు. ఎ. కృష్ణారావు అనువాదం సరళంగా ఉంది. అచ్చుతప్పుల విషయంలో జాగ్రత్త పడాల్సింది. రాజకీయ, ఆర్ధిక అంశాలపై ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు  235, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

3 కామెంట్‌లు:

  1. ఆర్ధిక సంస్కరణలే కాదు నగదు బదిలీ,ఆధార్ కార్డు,సమాచార చట్టం వంటివి కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంస్కరణలే,సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లు ప్రజల మనసులో ఒక దురభిప్రాయం పడ్డ తర్వాత మంచి చేసినా గుర్తించరు.

    రిప్లయితొలగించండి
  2. @నీహారిక: "సాక్షాత్తూ శ్రీకృష్ణుడంతటి వాడు కూడా 'నేను దేవుణ్ణి' ని పిల్లికర్ర ఊది మరీ ప్రచారం చేసుకున్నాడు.. మానవమాత్రులం మనం ఎంత?" అన్నారండీ బీనాదేవి ఓ రచనలో.. కాబట్టి ప్రచారం చేసుకోలేని (చేయించుకోలేని) వాళ్ళదే పాపం.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి