ఉప్పల లక్ష్మణరావు పేరు వినగానే తెలుగు సాహిత్యంతో పరిచయం 
ఉన్న వారందరికీ 'అతడు-ఆమె' నవల గుర్తొస్తుంది. స్వాతంత్రోద్యమ నేపధ్యంలో 
రాసిన ఆ నవల తెలుగులో తప్పక చదవాల్సిన పుస్తకాల్లో ఒకటి. వృక్ష 
శాస్త్రవేత్త మొదలు, ప్రగతి ప్రచురణాలయం (మాస్కో) లో తెలుగు అనువాదకుడి 
వరకూ ఎన్నో బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ రావు తన ఎనభై మూడో ఏట 1981లో 
రాసుకున్న ఆత్మకథ 'బతుకు పుస్తకం.' మొదట ఆంధ్రజ్యోతి లో ధారావాహిక గానూ, 
అటుపై విశాలాంధ్ర ద్వారా పుస్తక రూపంలోనూ వెలువడిన ఈ రచనని గతేడాది 
పునర్ముద్రించారు విజయవాడ 'సాహితీ మిత్రులు.' 
బరంపురంలో ఓ 
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన లక్ష్మణరావు బాల్యమంతా మాతామహులు దిగుమర్తి 
వెంకటరామయ్య పంతులు గారింటనే గడిచింది. వాళ్ళందరూ విద్యావంతులు, రాజకీయ 
చైతన్యం ఉన్న వాళ్ళు. (మాజీ రాష్ట్రపతి వరాహగిరి వేంకటగిరి లక్ష్మణరావు 
గారికి వరుస సోదరుడు). తాతగారి తరిఫీదులో చిన్ననాడే నాటి ఆంగ్ల పత్రికలని 
ఆమూలాగ్రంగా చదవడం అలవాటు చేసుకున్న లక్ష్మణరావుకి, ఇంగ్లీష్ భాషతో పాటు 
నాటి ప్రపంచ రాజకీయాలూ కరతలామలకమయినాయి. చదువు కోసం చిన్ననాడే ఇల్లు విడిచి
 కొంతకాలం మద్రాసులోనూ, మరికొంత కాలం విశాఖపట్నం లోనూ అటుపై కలకత్తాలోనూ 
విద్యాభ్యాసం చేసి పై చదువులకోసం జర్మనీ వెళ్లారు లక్ష్మణరావు. 
తనకిష్టమైన
 శాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేసి భారతదేశానికి తిరిగివచ్చేలోగా మెల్లీ 
సోలింగర్ అనే స్నేహితురాలి నుంచి పెళ్లి ప్రతిపాదన అందుకున్న లక్ష్మణరావు, 
చాలా సంయమనంతో తన నిర్ణయం చెప్పారు. ఆమె భారతదేశానికి వచ్చి, కొంత కాలం 
గడిపిన తర్వాత కూడా ఇదే ప్రతిపాదన చేస్తే తప్పక అంగీకరిస్తాననీ, ఆమె కనుక 
తన వాతావరణంలో ఇమడ గలదన్న నమ్మకం తనకి కలిగినట్టైతే తానే పెళ్లి ప్రతిపాదన 
చేస్తాననీ ఒప్పించారు. అన్నమాట ప్రకారం ఆమె భారతదేశానికి రావడం, మరో 
ఎనిమిదేళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ మాస్కోలో భార్యాభర్తలు కావడం జరిగింది. ఈ 
దంపతులు సంతానం వద్దనుకోడానికి కారణాన్ని లక్ష్మణరావు గారి మాటల్లో 
చదవాల్సిందే. 
చిన్ననాడు ఏర్పడిన రాజకీయ చైతన్యం వయసుతో పాటు 
పెరిగి పెద్దదయ్యింది లక్ష్మణరావు గారిలో. మెల్లీతో కలిసి మహాత్మా గాంధీ 
పిలుపు ఇచ్చిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజానికి, లక్ష్మణ రావు 
కన్నా మెల్లీనే ఎక్కువగా ఉద్యమ జీవితం గడిపారు. ఓ విదేశీ వనిత భారత 
స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించడం, జైల్లో ఖైదీల 
కనీసావసరాలకోసం సత్యాగ్రహం చేయడం ఆశ్చర్య పరిచే విషయాలు. లక్ష్మణరావు 
ఉద్యోగ, రాజకీయ జీవితాలు కొంత కాలం విడివిడిగానూ మరికొంత కాలం కలివిడిగానూ 
సాగాయి. కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టు పార్టీ భావజాలానికి ఆకర్షితులైనా, 
పార్టీ క్రియాశీల సభ్యుడిగా చేరేందుకు ఎన్నో ఏళ్ళ సమయం తీసుకున్నారు. 
చదువుకి
 సంబంధం ఉన్నవీ, లేనివీ కూడా ఎన్నో ఉద్యోగాలు చేసిన లక్ష్మణరావు, ప్రగతి 
ప్రచురణాలయం లో ఉద్యోగం రాగానే రెండో ఆలోచన లేకుండా చేరిపోయారు. మెల్లీ సంఘ
 చైతన్య కార్యక్రమాలపై దృష్టి  పెట్టారు. మాస్కో జీవితాన్ని గురించి ఎంతో 
ఉత్సాహంగా చెప్పిన లక్ష్మణరావు, తనకెదురైన ఓ పెద్ద పరీక్షనూ, దాన్ని తను 
దాటిన వైనాన్నీ ఆర్ద్రంగా చెప్పారు. వందేళ్ళనాటి బరంపురం, మద్రాసు, 
విశాఖపట్నం, లండన్, జర్మనీ, మాస్కో నగరాలు, నాటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక 
పరిస్థితులు, ఒక యాభయ్యేళ్ళ కాలంలో వాటిలో వచ్చిన మార్పులు వీటన్నింటినీ తన
 కథతో పాటు చెప్పుకుంటూ వచ్చారు. 
ఓ బృహత్ గ్రంధానికి సరిపడే సాధన సామగ్రి ఉన్నప్పటికీ, తన ఆత్మకథని 208 పేజీల్లో ముగించారు లక్ష్మణరావు.
 క్లుప్తతకి పెద్ద పీట వేశారని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సీరియస్
 విషయాలు, సరదా సంగతుల కలబోతగా మలిచినందువల్ల తెలియకుండానే పేజీలు  
తిరిగిపోతాయి. సగం పేజీల తర్వాత ప్రవేశించే మెల్లీ సోలింగర్ రెండో సగమంతా 
తనే అయ్యారు. అక్కడక్కడా కొన్ని పేజీల్లో ఆమె ప్రస్తావన లేని చోట్ల, కథలోకి
 ఆమె ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు పాఠకులు. ఆమె జీవితాన్ని గురించి
 లక్ష్మణరావు ఓ పూర్తి పుస్తకాన్ని రాసి ఉంటే బాగుండుననిపించింది. ముద్రణ 
బాగున్నప్పటికీ, ముద్రా రాక్షసాలు చిరాకు పెట్టాయి. చరిత్రనీ, ఆత్మకథలనీ 
ఇష్టపడే వాళ్లకి నచ్చే పుస్తకం. (సాహితీ మిత్రులు ప్రచురణ, పేజీలు  208, 
వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). 

ఇన్ని పుస్తకాలు చదివినందుకు మీకో అవార్డు ఇవ్వాలనిపిస్తోంది(మా అభిమాన సుమన్ బాబుని ఎంత సతాయించారసలు?!)
రిప్లయితొలగించండి"ఆధునిక పుస్తక పఠనా పితామహుడు" అని బిరుదిచ్చేయమంటారా ?
@నీహారిక: ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయండీ.. మీరప్పుడే ఇలా అనేస్తే ఎలా? :) ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి