శనివారం, మే 21, 2016

కర్మభూమి

సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య  అంతరాలు తగ్గించాలంటే ధనికులు సొంత లాభం కొంత మానుకుని పేదల ఆర్దికాభివృద్ధి కోసం ఉదారంగా పని చేయాలి అని ప్రతిపాదించారు సుప్రసిద్ధ  భారతీయ రచయిత ప్రేమ్ చంద్ సుమారు శతాబ్ద కాలం క్రితం తను రాసిన నవల 'కర్మభూమి' లో. హిందీ, ఉర్దూ, పార్సీ, ఆంగ్ల భాషల్లో ప్రవీణుడైన ఈ రచయిత బ్రిటిష్ పాలనలో భారతదేశ స్థితిగతులని తన నవలల ద్వారా పాఠకుల కళ్ళకి కట్టారు. ఓ ధనవంతుడైన వ్యాపారి కొడుకు అమర్ కాంత్ తన జీవితాన్ని పేదవాళ్ళ సేవకోసం అంకితం చేయడంతో, అతని స్పూర్తితో ఆ కుటుంబం మొత్తం సమాజసేవ వైపు అడుగులు వేయడమే 'కర్మభూమి' నవల ఇతివృత్తం.

లాలా సమర్ కాంత్ చాలా చిన్న స్థాయిలో జీవితాన్ని మొదలు పెట్టిన వ్యక్తి. పూరింటిలో మొదలైన అతని ప్రయాణం వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి పట్టణ ప్రముఖుడిగా అవతరించే స్థాయికి ఎదిగింది. సమర్ కాంత్ కి ఇద్దరు సంతానం. కొడుకు అమర్ కాంత్, కూతురు నైనా. మొదటినుంచీ అమర్ కాంత్ కి డబ్బన్నా, ఆడంబరాలన్నా కిట్టవు. క్రమశిక్షణ పేరిట  కొడుకుని బాగా కట్టడి చేస్తాడు సమర్ కాంత్. నైనాకి అన్నంటే పంచ ప్రాణాలు. ఆమె చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా, అన్నకి తనే తల్లిగా వ్యవహరించేంత పెద్దరికం, పొందికా ఉన్న అమ్మాయి నైనా.

కాలేజీలో చదువుతున్న అమర్ కాంత్ కి గొప్పింటి అమ్మాయి సుఖదాతో వివాహం జరిగింది. ఆమె ఇంకా కాపురానికి రాలేదు. స్నేహితుడు సలీం, గురుతుల్యుడు  శాంతికుమార్, చెల్లెలు నైనా.. వీళ్ళే అతని ప్రపంచం. సాయంత్రాలు సభలు, సమావేశాలు అంటూ తిరుగుతున్న కొడుకు, అందుకు బదులుగా తనకి సాయంగా ఉంటూ వ్యాపారంలో మెళకువలు నేర్చుకోవచ్చు అన్నది సమర్ కాంత్ అభిప్రాయం. అయితే అమర్ ఆలోచనలు పూర్తిగా వేరు. అతనికి వ్యాపారం మీద ఏమాత్రం ఆసక్తి లేదు. నిజానికి బ్రతుకుతెరువు గురించి పెద్దగా ఆలోచన లేదు. తనకి నచ్చిన పనులు చేస్తూ కాలం గడపడమే ఇష్టం. ఇలాంటి పరిస్థితుల్లో సుఖదా కాపురానికి వస్తుంది.


మొదటినుంచీ భోగ భాగ్యాల్లో పెరిగిన సుఖదాకి అమర్ వైఖరి అర్ధం కాదు. నైనా తో ఆమెకి ఇట్టే స్నేహం కలుస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించిన సుఖదా, దానిని పూడ్చవలసిన బాధ్యత తన మీద ఉందని గ్రహించి అమర్ ని 'దారికి తెచ్చే' ప్రయత్నాలు ఆరంభిస్తుంది. అయితే, స్వభావ రీత్యా అమర్ సుఖదాలిద్దరూ భిన్న ధ్రువాలు. తొలుత సుఖదా ఆకర్షణలో పడ్డ అమర్ తర్వాత తామిద్దరి ద్రుక్పధాలలో ఉన్న భేదాన్ని గుర్తిస్తాడు. సుఖదా ఎంత ప్రయత్నించినా వాళ్ళ మధ్య అంతరాలు పెరుగుతాయి.  సకీనా అనే అమ్మాయికి కొంత దగ్గరై, అంతలోనే దూరమైన అమర్ కాంత్ సుఖదాకి కొడుకు పుట్టిన తర్వాత ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.

భర్త దూరమైన తర్వాత అతని ఆలోచనలని అర్ధం చేసుకోడం ఆరంభిస్తుంది సుఖదా. పట్టణంలో పేదలకి వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలని అడ్డుకునే పోరాటంలో దిగి, పేదలకి మురికివాడల్లో కాక మంచి గాలీ నీరూ దొరికే స్థలంలో ఇళ్ళు ఏర్పాటు చేయాలని ఉద్యమం ఆరంభించి నాయకురాలవుతుంది. మరోపక్క శాంతికుమార్ పేదల కోసం ఒక ట్రస్టుని ఆరంభిస్తాడు. ఉద్యమం ఎంతగా పెరిగి పెద్దదవుతుందంటే, ఒకప్పుడు కొడుకు ఆలోచనల్ని పూర్తిగా వ్యతిరేకించిన సమర్ కాంత్ కోడలు మొదలు పెట్టిన ఉద్యమంలో ముందుండేంత. ధనవంతుడైన మునీరాంతో నైనాకి వివాహం జరుగుతుంది. కానీ, ఆ పెళ్ళిలో ఇమడడం నైనాకి శక్తికి మించిన పని అవుతుంది.

ఇల్లు విడిచిపెట్టిన అమర్ కాంత్ ఓ పల్లెకి చేరుకొని అక్కడి పిల్లల కోసం ఓ పాఠశాలని ఆరంభిస్తాడు. జనంతో కలిసి పని చేసే క్రమంలో వాళ్ళ సమస్యలకి మూలాన్ని తెలుసుకుంటాడు. జమీందారు, ప్రభుత్వం కలిసి భారీ మొత్తంలో శిస్తులు వసూలు చేయడం వల్లే రైతులు శ్రమకి తగ్గ ఫలితం పొందలేకపోతున్నారని గ్రహించిన అమర్, పేదలందరినీ కూడగట్టడం ఆరంభిస్తాడు. చదువు పూర్తి చేసిన సలీం అదే ప్రాంతానికి పోలీసు అధికారిగా రావడంతో, అమర్ కాంత్ ఆరంభించిన ఉద్యమాన్ని అణచివేయాల్సిన బాధ్యత సలీం మీద పడుతుంది. అటు పట్టణంలోనూ, ఇటు పల్లెలోనూ జరుగుతున్న ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లాలా సమర్ కాంత్ కుటుంబం లక్ష్యాన్ని చేరుకోగలిగిందా? అమర్-సుఖదాల కథ ఏ మలుపు తిరిగిందన్నది ముగింపు. పోలు శేషగిరి రావు అనువాదం సరళంగా ఉంది. ఆపకుండా చదివించే కథనం. (సాహితి ప్రచురణలు, పేజీలు  336, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు:

  1. అప్రయత్నంగా చాలాసార్లు అనుకునే మాట అడిగేస్తున్నా.. మీ గడియారంలో గంటలెన్ని?

    రిప్లయితొలగించండి
  2. @కొత్తావకాయ: హాహాహా.. ఇండియన్ గడియారం అండీ.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి