మంగళవారం, అక్టోబర్ 22, 2013

కృష్ణశాస్త్రి బాధ...

"కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ" అన్నాడు గుడిపాటి వెంకటాచలేయుడు, శ్రీశ్రీ 'మహాప్రస్థానం' పుస్తకానికి ముందుమాట రాస్తూ... ఇప్పుడు ప్రపంచం మొత్తానికి 'కృష్ణశాస్త్రి' ఎవరంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అస్సలు ఆశ్చర్యం అక్కర్లేదు, ఎందుకంటే అమెరికా బాధ ప్రపంచం బాధ అయి కూర్చుంది ఇప్పుడు. అమెరికా ఆర్ధిక వ్యవస్థకి నీరసం చేస్తే, మూడొంతుల ప్రపంచ దేశాలు వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆందోళన పడడం ఇవాళ కొత్తగా మొదలైంది కాదు.. నూతన ఆర్ధిక సంస్కరణలని నీడలాగా అనుసరించిన పరిణామం ఇది.

ఇరవై రెండేళ్ళు వెనక్కి వెళ్తే, ఢిల్లీలో కాంగ్రెస్ మైనారిటీ సర్కారుని పీవీ నరసింహారావు ప్రధానిగా సారధ్యం వహించి నడిపిస్తున్న రోజులు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాల వల్ల దివాలాకి దగ్గరలో ఉన్నాయి. తీవ్రమైన డబ్బు కటకట. జాతి సంపద అయిన బంగారం నిలవలని తాకట్టు పెట్టి సొమ్ము తెచ్చినా, కేవలం కొన్ని నెలల్లోనే ఆర్ధిక వ్యవస్థ పుంజుకుని పరుగులు తీసే పరిస్థితి ఏమాత్రమూ లేదు. ఆ బంగారాన్ని అమ్మేస్తే, దేశ భవిష్యత్తు అవసరాలు మరి?

సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం ముందుకు వచ్చిన ఓ ప్రత్యామ్నాయం నూతన ఆర్ధిక సంస్కరణలు. అప్పటివరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద విపరీతమైన ఆంక్షలు విధిస్తూ -- పారిశ్రామికవేత్తల మాటల్లో చెప్పాలంటే 'మడి కట్టుకుని' -- ఉన్న భారతదేశం విదేశీ పెట్టుబడులని ఆహ్వానించింది. ఒక్కసారిగా మొత్తం అన్ని రంగాలకీ గేట్లు బార్లా తెరవకుండా, ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో, కొంత శాతం మేరకు విదేశీ పెట్టుబడులని ఆహ్వానించే విధంగా నిబంధనలని సడలించింది. ఫలితంగా ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయి.. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ఊపందుకుంది. 

వందల్లో పరిశ్రమలు, లక్షల్లో ఉద్యోగాలు.. ఒక్కమాటలో చెప్పాలంటే దశ తిరిగింది... ఉన్నత, మధ్య తరగతి వర్గాలది, దేశ ఆర్ధిక వ్యవస్థదీ కూడా. ఇది నాణేనికి ఒకవైపు. ప్రతి నాణేనికీ బొమ్మా బొరుసూ ఉన్నట్టే, ఈ నాణేనికీ ఉన్నాయి. నూతన ఆర్ధిక సంస్కరణలు మంచిని మాత్రమే వెంటపెట్టుకుని రాలేదు. భారత సమాజంలో పేదా, గొప్పా అంతరాలు మొదటినుంచీ ఉన్నవే అయినా, అవి మరింతగా పెరిగిపోడానికి దోహదం చేశాయి. వ్యవసాయ రంగాన్నైతే సంక్షోభంలోకి నెట్టేశాయి.

సంస్కరణల ఫలితంగా ఇప్పుడు మార్కెట్ అంటే ఒక్కటే మార్కెట్.. అది గ్లోబల్ మార్కెట్.. స్వేచ్చా వాణిజ్యం అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన సరుకు తక్కువధరలో దొరికే చోటునుంచి సులభంగా తెచ్చుకో గలుగుతున్నాడు వినియోగదారుడు.. (ఇక్కడి లొసుగులు ఇక్కడా ఉన్నాయి, అది వేరే కథ). ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలోనే, ప్రభుత్వం నుంచి నామమాత్రంగా అందుతున్న మద్దతుతో వ్యవసాయం సాగిస్తున్న భారతీయ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పెట్టుబడులు పెరిగిపోవడం, ధరలు పడిపోవడం ఒక్కసారిగా జరగడంతో వ్యవసాయరంగం ప్రమాదం అంచున నిలబడింది.

వ్యవస్థ ఏదైనా కావొచ్చు.. కానీ బలవంతుడిదే పైచేయి అన్న ప్రాధమిక సూత్రంలో ఏమార్పూ ఉండదు.. మార్కెట్ మొత్తం కేంద్రీకృతం అయిపోవడం ఫలితం ఏమిటంటే, ఆ మార్కెట్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అమెరికాలో ఏం జరిగినా దాని ప్రభావం మార్కెట్ మీద, తద్వారా ఆ మార్కెట్లో భాగస్వాములైన ప్రపంచ దేశాల మీద పడి తీరుతుంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ కళకళలాడితే, మిగిలిన దేశాల్లో పరిస్థితులు బాగుంటాయి. ఆ వ్యవస్థకి ఏ చిన్న జలుబు చేసినా అన్ని దేశాలూ తుమ్మడం ప్రారంభిస్తాయి.. ఇప్పుడిక అమెరికా కృష్ణశాస్త్రి కళ్ళలో ఆనందం కోసం ఎదురుచూడాలి మనం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి