మంగళవారం, డిసెంబర్ 24, 2024

వంశీ మా పసలపూడి కథల కమామిషు

"అసలు కమామిషు అన్న మాట విని ఎన్నాళ్ళయింది?" అని ఆలోచనలో పడ్డాను పుస్తకం పేరు చూడగానే. చదవడం పూర్తిచేయగానే వచ్చిన ఆలోచన అయితే "ఏముంటాయి ఆ పసలపూడి కథల్లో? తిండి గోలా, సెక్సు గొడవలూ తప్పిస్తే" అని వెటకరించే మిత్రులకి నోటితో సమాధానం చెప్పే బదులు ఈ పుస్తకాన్ని చేతిలో పెడితే సరిపోతుంది కదా అని. వంశీ రాసిన 'మా పసలపూడి కథలు' అనే డెబ్బై రెండు కథల సంకలనాన్ని పరిశోధనాంశంగా తీసుకుని, కె. రామచంద్రా రెడ్డి అనే పరిశోధకుడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించిన పీహెచ్డీ థీసిస్ ఇది. సాహిత్యాభిమానుల కోసం పుస్తక రూపంలో మార్కెట్లోకి వచ్చింది. ఒక రచయిత/రచయిత్రి సమగ్ర రచనల మీద పరిశోధన జరగడం, లేదూ ఒక నవల మీద సమగ్ర పరిశోధన జరగడం తెలుగునాట ఆనవాయితీగా వుంది. అయితే కేవలం ఒక్క కథాసంకలనమే పరిశోధనాంశం కావడం అరుదు. 'మా పసలపూడి కథలు' ఈ అరుదైన ఘనతని సాధించడం వంశీ (కొన్ని) సినిమాలు, రచనల అభిమానిగా వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.

సాహిత్యాంశానికి సంబంధించినవే అయినప్పటికీ చాలా పరిశోధనా గ్రంధాలు సామాన్య పాఠకులకి పఠనీయంగా వుండవు. రీసెర్చ్ ఫార్మేట్ లో చాలా అకడమిక్ గా వుండి, పుస్తకంలో పేజీలు బరువుగా కదులుతూ ఉంటాయి. ఈ పరిశోధనా గ్రంధం అందుకు మినహాయింపు. సూటిగా విషయంలోకి వెళ్లిపోవడం ఒకటైతే, చాలా చోట్ల ఈ పరిశోధకుడి ప్రతిపాదనలు, వెలికితీసిన విషయాలు చదువుతుంటే "ఇవి మనం చదివిన కథల గురించేనా?!" అని అడుగడుగునా కలిగే ఆశ్చర్యం మరొకటి.  ఉదాహరణకి: "వందేళ్ళకి మించిన తెలుగు కథా సాహిత్యంలో ఏ కథని తీసుకున్నా ఐదుకి మించిన పాత్రల పేర్లు చెప్పిన కథలు అత్యరుదుగా వుండవచ్చు. కానీ, వంశీ కథలలో ఐదుకు తక్కువగా పాత్రల పేర్లు చెప్పిన కథలు కూడా అత్యరుదుగా వున్నాయి. ఆయన ప్రతి కథలోనూ ఐదుకు పైగానూ అత్యధికంగా పద్ధెనిమి వరకూ (పన్నెండో కథ 'తామరపల్లి సత్యం గారి తమ్ముడు రామం') పాత్రల పేర్లు చెప్పిన కథలూ కనిపిస్తాయి", లాంటి పరిశీలనలు కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి.

మొత్తం పది అధ్యాయాలుగా విభజించిన ఈ పుస్తకంలో నాలుగో అధ్యాయం 'మా పసలపూడి కథల్లో మాండలికం -  భాషా విశేషాలు' అతి పెద్ద అధ్యాయం. మొత్తం 254 పేజీల పుస్తకంలో ఈ ఒక్క అధ్యాయమే 84 పేజీలు. నామవాచకాలు, సర్వనామాలు, క్రియా వాచకాలు, విశేషణ వాచకాలు, కథల కాలం దృష్ట్యా గృహోపకరణాలు, ప్రయాణ సాధనాలు, ఇతర కొలమానాలు, ఆహార పదార్ధాలు, అన్యభాషా పదాల, జంట పదాల, తిట్ల పలుకుబడి.. ఇవన్నీ ఈ అధ్యాయంలో భాగాలే. ఒక్క ఆహార పదార్ధాల లోనే అల్పాహారాలు, చిరుతిళ్ళు, మాంసం, చేపల వంటకాలు, ఇతర విభిన్న ఆహార పదార్ధాలు, పానీయాలు అనే విభాగాలు ఉన్నాయి. పరిశోధన 'లోతు' ఎంతో తెలుసుకోడానికి ఈ ఒక్క అధ్యాయం చాలు. "భారతదేశంలో ముసల్మానుల పరిపాలన ప్రభావం వల్ల ఉత్తర భారతంలో తయారయ్యే తీపి వంటకాలకు ఆ రాజుల నమ పదాలను పెట్టుకోవడం పూర్వం జరిగింది. ఆ వంటకాలు దేశం అంతా విస్తరించి నేడు అవే పేర్లు స్థానీయ పలుకుబడిలో వున్నాయి. ఖాజా-కాజా, బాదుషా, జహంగీర్-జాంగ్రీ మొదలైనవి" రెండు కథల్లో ప్రస్తావనకు వచ్చే తాపేశ్వరం కాజాని గురించి వివరణ ఇది.


'మా పసలపూడి కథలు-సింహావలోకనం-సమీక్షలు' అనే అధ్యాయంలో నాలుగో కథ 'కోరి రావులు గారి బస్ కండక్టర్' కథని గురించి చెబుతూ "మానవత్వం వున్న భద్రం ఏ పనిలోనూ ఇమడక కష్ఠాలు తెచ్చుకుంటూ వూరు వదిలి ఎటో వెళ్లిపోయాడని చెప్పడంలో రచయిత మంచి వాళ్ళకి ఈలోకంలో చోటు లేదని అన్యాపదేశంగా చెబుతారు" అన్నారు రామచంద్రారెడ్డి. అయితే, ఈ కథలో కండక్టర్ భద్రం తాను చేసే సాయాలకి తన యజమాని రావులు గారి బస్సుని వాడుకోవడం (బస్సులో ప్రయాణించే వాళ్ళ అవసరాలకి అనుగుణంగా అప్పటికప్పుడు రూటు మార్చేయడం - దాదాపు ప్రతిరోజూ) ఎంతవరకూ ఆమోదయోగ్యం అన్న ప్రశ్న వస్తుంది. తన శృతి మించిన మంచితనం కారణంగా యజమానికి (బస్సు వ్యాపారానికి) నష్టం చేస్తున్నానన్న ఆలోచన భద్రంలో వున్నట్టు కనిపించదు. 'మునగచెట్టు' కథకి శ్రీరమణ 'మిథునం' తో పోలిక తేవడం ముచ్చట గొలుపుతుంది. వంశీ కథలతో అతిపెద్ద సమస్య పేర్ల మార్పు. ఓకే కథ వేర్వేరు సంకలనంలో వేరే వేరే పేర్లతో వస్తూ వుంటుంది. ఇందుకు 'మా పసలపూడి కథలు' కూడా మినహాయింపు కాదని చెబుతుందీ పరిశోధనా గ్రంధం.

పసలపూడి కథలన్నీ, ఆ మాటకొస్తే వంశీ రచనలన్నీ, వర్ణన ప్రధానంగా సాగేవే. 'మా పసలపూడి కథలు - వర్ణనలు' అనే అధ్యాయాన్ని మానవ స్వాభావిక వర్ణనలు, ప్రకృతి వర్ణనలు, పల్లె వర్ణనలు, వంటల వర్ణనలు అనే నాలుగు భాగాలుగా విభజించారు. ప్రకృతి వర్ణనల్లో, ఋతు వర్ణనల్ని ప్రత్యేకంగా చేర్చారు. అయితే, వంశీ ప్రతి కథలోనూ చేసే ప్రకృతి వర్ణన రాబోయే సన్నివేశాన్ని లీడ్ చేసేదిగా వుంటుందన్నది నా గమనింపు. వర్ణనని చదువుతూనే పాఠకుడు ఒక మూడ్ లోకి వెళ్తాడు. జరగబోయే సన్నివేశం అచ్చంగా ఆ మూడ్ కి తగ్గట్టుగానే వుంటుంది. పచ్చని ప్రకృతి ఉంది కాబట్టి వర్ణించడం కాదు, వర్ణన ద్వారా తర్వాతి సన్నివేశానికి పాఠకుణ్ణి ప్రిపేర్ చేసి నెమ్మదిగా తీసుకువెళ్లడం. వంటల వర్ణనల్లో "ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ వంటల గురించి వివరించిన తీరులో ఆ ప్రాంతపు జీవన శైలిని మరో కోణంలో పాఠకులకి పరిచయం చేయడం వుంది. ఇక్కడ విషయం బతకడం కోసం చేసే భోజనం గురించి కాదు. భోజనం వంకన అక్కడి ప్రజల నడుమ అనురాగానికి ఆ సందర్భాలు ప్రతీకలు. అక్కడి మనుషుల మధ్య పెనవేసుకున్న సాంఘిక జీవన విధానాలని ఆ భోజన పద్ధతుల ద్వారా వివరించే ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో ఈ కథకుడు విజయుడయ్యాడు" అంటారు.

శిల్పాన్ని గురించి చెబుతూ "వంశీ గారి పసలపూడి కథల్లో నిర్దిష్టమైన భౌగోళిక, ప్రాంతీయ స్వభావాన్ని చూడొచ్చు. గోదావరి పరివాహక ప్రాంతాన్ని నేపధ్యంగా తీసుకుని రాసిన ఈ కథలన్నిటికి నిర్దిష్టమైన భాషా సాంస్కృతిక లక్షణాలున్నాయి. రచయిత వాడిన ప్రాంతీయ నుడికారం, ప్రతి వస్తువుకి విశేషణం, దాని వెనకున్న ప్రాంతీయ ప్రత్యేకత కథలకు అదనపు సౌందర్యాన్నిచ్చింది" అన్నారు రామచంద్రారెడ్డి. "కేవలం వర్ణనాత్మక చిత్రణ, భాష, పేర్లు ఇత్యాది విలక్షణాలు వుంటే మాత్రం వంశీ కథలు ఏం చెప్తాయి అనే ప్రశ్నకు ఆ కథలలో - గొప్ప మనసుతో ఎందరినో ఆదుకున్న పాత్రలు, విలువల కోసం తాపత్రయ పడే పాత్రలు, స్వచ్ఛమైన ప్రేమతో ఆకట్టుకునే పాత్రలు, గొప్ప కళా నైపుణ్యంతో వెలుగొందిన జీవితాలు మొదలైనవి ఆదర్శవంతాలు. మోసాలు, ద్వేషాలు, అక్రమ సంబంధాలు అన్యాపదేశంగా చెప్పే మానవ విలువల ప్రాధాన్యాలే ఈ కథల పరమావధి" అనేది ఈ కథలు చదివిన పాఠకులందరూ ఆమోదించే ప్రతిపాదన. పరిశోధకుడే ప్రచురించుకున్న ఈ పుస్తకం వెల రూ. 260. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్ లైన్ లోనూ కొనుక్కోవచ్చు. మలిముద్రణలో అచ్చుతప్పుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది.

సోమవారం, డిసెంబర్ 09, 2024

అవస్థ

నాలుగున్నర దశాబ్దాలకి పూర్వం యు.ఆర్. అనంతమూర్తి రాసిన కన్నడ నవలకి 'అవస్థే' కి రంగనాథ రామచంద్రరావు చేసిన తెలుగు అనువాదం 'అవస్థ' నవల. దక్షిణ కర్ణాటక లోని శివమొగ్గ (షిమోగా) ప్రాంతానికి చెందిన అనంతమూర్తి, ఆ ప్రాంతాన్ని, అక్కడి స్వాతంత్య్రానంతర రాజకీయ వాతావరణాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవలలో ప్రధాన పాత్ర కృష్ణప్ప గౌడ. పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, అక్షరం సాయంతో ఎదిగి, నాయకత్వ లక్షణాల కారణంగా శాసన సభ్యుడిగా విజయాలు సాధించడమే కాక, ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడే స్థాయికి చేరతాడు. ఈ దశలోనే అతణ్ణి అనూహ్యంగా అనారోగ్యం కబళిస్తుంది. పక్షవాతం కారణంగా శరీరం చచ్చు బడుతుంది. గౌడ ఆరోగ్యవంతుడవుతాడనీ, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడనీ అనుచరుల్లో గొప్ప నమ్మకం.  

గౌడ రాజకీయ అనుచరుల్లో ఒకడైన నాగేశ, కృష్ణప్ప గౌడ జీవిత చరిత్ర రాయడానికి పూనుకుంటాడు. అతనికి చెప్పే క్రమంలో గౌడ తన జీవితాన్ని నెమరు వేసుకోవడం, అటుపై తన ఇంటికి నడిచి వచ్చిన ముఖ్యమంత్రి పదవిని చేపట్టే విషయంతో సహా తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి ఉద్యుక్తుడు కావడంతో నవల ముగుస్తుంది. బాల్య జీవితం కృష్ణప్ప గౌడ వ్యక్తిత్వం పై ఎలాంటి ప్రభావాన్ని చూపింది, యవ్వనంలో అతని జీవితంలో ప్రవేశించిన వ్యక్తులు తర్వాతి జీవితం మీద ఏవిధంగా తమదైన ముద్రని వేశారు అన్నది సునిశితంగా చెప్పారు రచయిత. పశువుల్ని కాసుకునే కృష్ణప్ప గౌడ జీవితంలోకి మహాదేవయ్య రావడం అతని జీవితంలో మొదటి మలుపు. కేవలం మహాదేవయ్య పూనిక, ఆర్ధిక సాయంతోనే గౌడ బడిలో చేరతాడు. నిజానికి మహాదేవయ్య కథలోనే ఒక నవలకి సరిపోయేంత వస్తుంవుంది. 

కాలేజీ రోజుల్లో కృష్ణప్ప గౌడ జీవితంలో ప్రవేశించే అణ్ణాజీ కథ మరో నవలకి సమానం. విస్తృతంగా చదివి, ఇంగ్లీష్ తో అనర్గళంగా మాట్లాడే ఈ వామపక్ష మేధావికి ఉన్న ఒకే ఒక్క వ్యసనం స్త్రీ. కృష్ణప్ప గౌడ మీద అన్నాజీ ప్రభావం తక్కువదేమీ కాదు. తనని ప్రేమించిన గౌరీ దేశపాండే కి కృష్ణప్ప తన ప్రేమని తెలుపక పోవడం వెనుక అణ్ణాజీ  ప్రభావం కూడా కొంత కారణం. తర్వాత జీవితంలో గౌడ అనుసరించిన రాజకీయ మార్గం, నడిపిన ఉద్యమాలు, పాటించాలని ప్రయత్నించే విలువలు వీటన్నిటి వెనుకా అణ్ణాజీ ప్రభావం వుంది. అసలు, కృష్ణప్ప గౌడ జీవితం ఒక ముఖ్యమైన మలుపు తిరిగి, రాజకీయ నాయకుడిగా మారడానికి కారణం కూడా అణ్ణాజీనే.  గౌడ శారీరక బలహీనతని, మానసిక బలహీనతలనీ సమాంతరంగా చిత్రిస్తూ రావడం, అలాగే వర్తమానంలో జరిగే కథతో సమాంతరంగా ఫ్లాష్ బ్యాక్ లని చెబుతూ రావడం వల్ల నవల చదివే పాఠకులకి ఊయల ఊగుతున్న అనుభూతి కలుగుతుంది చాలాసార్లు. 


కృష్ణప్ప గౌడ ఆశయాలకీ, ఆచరణకీ మధ్య ఉన్న భేదం, తత్కారణంగా అతని అంతర్మధనమే 'అవస్థ' నవల లో ప్రధాన కథ. నిజానికి ఇలా భేదం వుండడం రాజకీయాల్లో సర్వ సాధారణం. అయితే, గౌడ అందరు నాయకుల లాంటి వాడు కాదు. అతని వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఈ వ్యక్తిత్వమే 'అవస్థ' నవలకు ఆయువు పట్టు. అతని జీవితంలో స్త్రీలందరూ గౌడని ఎంతో కొంత ప్రభావితం చేసిన వాళ్ళే. తల్లి శారదమ్మ, చిన్నప్పుడు ఆదరించిన రుక్మిణమ్మ, కాలేజీ రోజుల్లో ఆరాధించిన గౌరీ దేశ్ పాండే, కొంతకాలం సహజీవనం చేసిన లూసినా, అణ్ణాజీ స్నేహితురాళ్ళు - మరీ ముఖ్యంగా చిన్నవీరయ్య భార్య ఉమ, గౌడ పెళ్లాడిన సీత, నర్సు జ్యోతి.. వీళ్లందరి ప్రభావం కృష్ణప్ప గౌడ చర్యలపై కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, వరంగల్ జైలు జీవితం అతనిపై చెరగని ముద్ర వేసింది. మౌన సన్యాసి ప్రభావమూ తక్కువది కాదు. 

ఉన్నత ఆశయాలని కలిగి ఉండడానికి, వాటిని ఆచరణలో పెట్టడానికి మధ్య భేదాన్ని సూక్ష్మంగా చిత్రించిన నవల ఇది. కృష్ణప్ప గౌడ ఆశయాలు గొప్పవి. అతడు వాటిని కలిగి ఉండడానికి దారి తీసిన పరిస్థితులూ ప్రత్యేకమైనవి. అయితే, వాటిని ఆచరణలో పెట్టలేకపోవడానికి కారణాలు మాత్రం ఊహించగలిగేవే. గౌడకి తన లక్ష్యంతో పాటు దానిని చేరుకునే మార్గమూ ముఖ్యమే. అతని సమస్యంతా తాను వెళ్తున్న మార్గం పట్ల పేరుకుపోయిన తీవ్రమైన అసంతృప్తి. దానిని మార్చలేని (మార్చుకోలేని) అసహాయత. "యితడు మానసికంగా అత్యంత బలవంతుడా లేక అతి దుర్బలుడా?" అనే ప్రశ్న పాఠకులకి చాలాసార్లే వస్తుంది. అతడిలో కనిపించే ద్వంద్వాలు ఒక్కోసారి అయోమయంలో పడేస్తాయి. అయితే, ఈ ద్వంద్వాలకి కారణాలు అతడి నేపధ్యం లోనూ, పెరిగిన విధానంలోనూ దొరుకుతాయి. 

రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదం సరళంగా వుంది. కన్నడ నుడికారాన్ని ఉపయోగించక తప్పని సందర్భాలలో ఇచ్చిన ఫుట్ నోట్స్ పాఠకులకి ఎంతో ఉపయుక్తం. అచ్చుతప్పులు తక్కువే. బాగా నిరాశ పరిచింది ఏదైనా ఉందంటే అది ముందుమాట. ఈ ముందుమాటలో మహాదేవయ్య  - పరమేశ్వరయ్య గానూ, అణ్ణాజీ - అప్పాజీ గానూ మారిపోయారు. కొన్ని వాక్యాలు పునరుక్తులయ్యాయి. నాలుగు పేజీల ముందుమాటలో ఇన్ని తప్పులు ఎలా వచ్చాయో అని ఆశ్చర్యం కలిగింది. కన్నడలో నవల గానే కాక సినిమాగానూ విజయవంతమై అవార్డులు పొందింది. అయితే, సోషలిస్టు నాయకుడు శాంతవేరి గోపాల గౌడ వారసులు, అనుచరుల నుంచి కోర్టు కేసులు ఎదుర్కొన్నారు అనంతమూర్తి. గోపాల గౌడ జీవితాన్నించి స్ఫూర్తి పొంది కృష్ణప్ప గౌడ పాత్రకి రూపకల్పన చేశారు. ఛాయ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన 198 పేజీల 'అవస్థ' వెల రూ. 160. ఆన్లైన్ లో కొనుగోలు చేయవచ్చు. 

సోమవారం, డిసెంబర్ 02, 2024

ఆరామ గోపాలమ్

బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ జీవితంలో ప్రతి దశలోనూ అలవి కాని కష్టాలే. జీవితపు ప్రతి మలుపు లోనూ ఊహించని ఇబ్బందులే. అయితేనేం, సాహిత్యాన్ని పడవగానూ, సంగీతాన్ని తెడ్డుగానూ చేసుకుని ఈ కష్టాల వైతరణిని దాటేసిన 'సామాన్యుడు' ఆయన. భరాగో అనే పొట్టిపేరుతో తెలుగు సాహిత్యాభిమానులకి తెలిసిన భమిడిపాటి రామగోపాలమ్ ఆత్మకథ 'ఆరామ గోపాలమ్' చదువుతుండగానూ, పూర్తి చేసిన తర్వాతా కూడా ముళ్ళపూడి వెంకటరమణకి 'కోతి కొమ్మచ్చి' రాయడానికి అతి పెద్ద ప్రేరణ బహుశా ఈ పుస్తకమే అయి ఉండొచ్చని బలంగా అనిపించింది. నిజానికి ముళ్ళపూడి బాల్యంలో కష్టపడ్డా, సినిమాల్లో స్థిరపడ్డాక జీవితం సాఫీగానే సాగింది. కానీ, భరాగో కథ అది కాదు. అయినా, మనుషుల్ని పోలిన మనుషులు ఉండొచ్చు కానీ జీవితాలని పోలిన జీవితాలు అరుదుగా తప్ప ఉండవు కదా. 

తన జీవిత కథని 'బాల్య లహరి' 'యువ తరంగం' 'ఉద్యోగ పర్వతం' 'సంసారం సాగరం' 'సాహిత్య వనం, సంగీత వాహిని' అనే ఐదు అధ్యాయాలుగా విభజించారు భరాగో. చివర్లో 'My Scribes' 'మిత్ర పుష్పాలు' అనే రెండు అనుబంధాలని చేర్చారు. విజయనగరం జిల్లాలో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో 1932 లో జన్మించారు రామగోపాలమ్. ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి బడిపంతులు. పెద్ద కొడుకు హైస్కూలు చదువుకి వచ్చేసరికి తండ్రికి పదవీ విరమణ వచ్చేసింది. పైగా. పింఛను లేని ఉద్యోగం. ఆ తండ్రికి ఉన్నదల్లా పిల్లల్ని బాగా చదివించాలన్న ఆశ. నిజానికి ఆశ కాదు, గట్టి పట్టుదల. స్కూలు ఫీజు కోసం కాలినడకన ఊళ్లు తిరిగి దానాలు స్వీకరించడం మొదలు, పిల్లవాడికి చదువుకునే ఊళ్ళో వారాలు కుదర్చడం వరకూ పడని శ్రమ లేదు. 

పోతన పద్యాలూ, త్యాగరాయ కృతులూ మొదలుగా భరాగోకి చిన్న నాటి నుంచీ సంగీత సాహిత్యాల పట్ల అభిరుచి యేర్పడింది. జీవితంలో ఎదురైన ప్రతి కష్టమూ ఈ రెంటినీ ఆయనకి మరింత దగ్గర చేసింది తప్ప, దూరం చేయలేదు. విజయనగరం బ్రాంచి కాలేజీలో చదువుకునే రోజుల్లో ఘంటసాల (వెంకటేశ్వర రావు) భరాగోకి 'సత్రం మేట్'. ఈ కాలేజీ కబుర్లు ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఆకాలంలోనే హిందీ సినిమా పాటలతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది భరాగోకి. తెలుగు పాటలు సరేసరి. కాలేజీ రోజుల్లోనే రచనా వ్యాసంగమూ మొదలైంది. ఆ కాలంలో కలం పట్టిన విజయనగరం కుర్రకారు అందరికి మల్లేనే భరాగో ఆశయం కూడా 'చాసోని మెప్పించే' కథ రాయడం. చాసో హవేలీ వెదజల్లిన సాహితీ పరిమళాలు అన్నీ ఇన్నీ కావని మరోమారు చెబుతుంది ఈ ఆత్మకథ. 


చదువు పూర్తవుతూనే భరాగో తక్షణావసరం ఉద్యోగం. ఓపిక తెచ్చుకుని ట్యూషన్లు చెబుతున్న తండ్రి, కంటి చూపు పోగొట్టుకున్న తల్లి, చదువుకుంటున్న తమ్ముళ్లు, వీళ్ళందరికీ ఓ భరోసా ఇచ్చేది ఉద్యోగమే. సర్వే శాఖలో చిన్న ఉద్యోగిగా ప్రవేశించి, అంచెలంచెలుగా నిచ్చెనమెట్ల ఎక్కడం, ఊహించని విధంగా ఉద్యోగం పోగొట్టుకోవడం, మళ్ళీ కష్టపడి పునర్నియామకపు ఉత్తర్వు సంపాదించుకోవడం, విశాఖ పోర్టు కి డిప్యుటేషన్ మీద వెళ్లి, అక్కడే స్థిరపడి పదవీ విరమణ చేయడాన్ని సరదాగా చెప్పేరు భరాగో. ఈలోగానే పెళ్లి, పిల్లలు, వాళ్ళ చదువులు, బాధ్యతలు ఒకపక్కా, సాహిత్య వ్యాసంగం మరోపక్కా సాగేయి.  దినపత్రికలో సాంస్కృతిక విలేకరిగా పార్ట్ టైం ఉద్యోగం మొదలు పెట్టి కాలమిస్టు గా ఎదగడం, ఈ క్రమంలో పెరిగిన పరిచయాలు, ఎదురైన అనుభవాలు, ఇదంతా సమాంతరంగా నడిచిన మరో కథ. 

చాలామంది కాలమిస్టుల్లాగే భరాగో కూడా అనేక కథా వస్తువుల్ని కాలమ్స్ గా కుదించేశారు. అయినప్పటికీ కూడా. 'వెన్నెల నీడ' 'వంటొచ్చిన మగాడు' లాంటి గుర్తుండిపోయే కథల్ని రాశారు. పోర్టు ట్రస్టు ప్రోత్సాహంతో వాటన్నింటినీ 'ఇట్లు మీ విధేయుడు' పేరిట కథా సంకలనంగా ప్రచురించి, 1991 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్నారు. కాలమ్స్ లో ఎంపిక చేసిన వాటిని 'సరదా కథలు' 'కథన కుతూహలం' పేరిట పుస్తకాలుగా ప్రచురించారు. వీటిలో 'కథన కుతూహలం' కి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం రావడం మాత్రమే కాదు, వీటిలో ఎంపిక చేసిన కథనాల్ని చిత్రించి దూరదర్శన్ లో 'భమిడిపాటి రామగోపాలం కథలు' పేరిట ప్రసారం చేశారు కూడా. ప్రముఖ నటుడు సుత్తివేలు భరాగో పాత్రని పోషించారు (యూట్యూబ్ లో చూడవచ్చు). అలా, చేయగలిగినంత సాహిత్య రచన చేయలేకపోయినా, చేసిన మటుకు గౌరవాలు అందుకున్నారు. 

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం, పదవీ విరమణ అనంతరం అనారోగ్యం కబళించి మంచానికి పరిమితమై పోయినా, రాసేందుకు శరీరం సహకరించకపోయినా, వ్రాయసకాండ్రని నియమించుకుని రచనల్ని కొనసాగించడం. అలా రాత సాయం అందించిన అందరినీ పేరుపేరునా 'My Scribes' అనుబంధంలో తలుచుకోవడం. ఈ పుస్తకం తాలూకు మరో ప్రత్యేకత ఛాయాచిత్రాలు. చిన్ననాటి నుంచి, చివరి రోజుల వరకూ తనకు తారసపడిన వారిలో తాను ప్రస్తావించిన అందరివీ ఛాయాచిత్రాలని ఈ పుస్తకంలో చేర్చారు. మునుపు ఏ ఆత్మకథ లోనూ ఇలా ఫోటోలు వాడడం జరగలేదని కూడా ఆయనే చెప్పారు. భరాగో అనగానే గుర్తొచ్చే 'సావోనీర్ రచన' ని గురించి కూడా వివరంగానే రాశారు తన ఆత్మకథలో. త్రివేణి పబ్లిషర్స్ ప్రచురించిన ఈ 384 పేజీల పుస్తకం వెల రూ. 300. డిస్ప్లే లో ఉండక పోవచ్చు కానీ, పుస్తకాల షాపులో జాగ్రత్తగా వెతికితే లోపలి అరల్లో దొరికే అవకాశం వుంది. కల్పనని మించిన వాస్తవాలు ఎన్నో వున్న ఆత్మకథ ఈ 'ఆరామ గోపాలమ్'.