ఆదివారం, అక్టోబర్ 04, 2015

'పూర్ణోదయా' నాగేశ్వర రావు

కాకినాడ సాల్ట్ ఇనస్పెక్టర్ గారబ్బాయి.. పీఆర్ కాలేజీగా పిలవబడే పిఠాపురం రాజా కాలేజీలో చదువుకునే రోజుల్లో నాటకాల సరదా మొదలయ్యింది. కాకినాడ అంటేనే కళలకి కాణాచి. ఇక నాటకరంగం సంగతి చెప్పక్కర్లేదు. ఈ కుర్రాడికి ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకతని పేరు వీరమాచనేని రాజేంద్రప్రసాద్.. మరొకతను హరనాథ రాజు. ముగ్గురూ కలిసి కాలేజీలో నాటకాలు ఆడారు. అబ్బే, కాలేజీలో ఏడాదికి ఒకటో, రెండో నాటకాలు అంతే. పైగా, ఓల్డ్ స్టూడెంట్స్ కి నాటకాలు వేసే అవకాశం లేదు. 'నాటకాలని వదిలేయాల్సిందేనా?' అన్న ప్రశ్న. జవాబు 'అవును' అయితే, తర్వాతి కథ వేరేగా ఉండేదేమో బహుశా. 

పీఆర్ కాలేజీలో చదువు పూర్తవుతూనే బళ్ళారి రాఘవని స్మరించుకుంటూ 'రాఘవ కళా సమితి' ఆరంభించారు. సాంఘిక నాటకాలకి దశ తిరిగిన కాలం. ఆచార్య ఆత్రేయ చేయితిరిగిన నాటక రచయితగా వెలుగొందుతున్న రోజులు. సినిమా పరిశ్రమకి అంజలీదేవి, ఆదినారాయణ రావు, రేలంగి, రావు గోపాలరావు లాంటి మహా మహులని అందించిన ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ ఉన్నది కాకినాడలోనే. అయినప్పటికీ, రాఘవ కళా సమితి అతి తక్కువకాలంలోనే తనకంటూ పేరు తెచ్చుకుంది. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నాలు, హరనాథ రాజు హీరో చాన్సుల కోసం మద్రాసు బయల్దేరారు. మిత్రుణ్ణి మర్చిపోలేదు.

తను తీసిన మొదటి సినిమా 'ఆరాధన' లో కాలేజీ మిత్రుడి చేత వేషం వేయించారు రాజేంద్ర ప్రసాద్. అటు పైని కూడా నటుడిగా అవకాశాలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. అయితే అవేవీ పెద్దగా గుర్తింపు రాడానికి అవకాశం ఉన్న పాత్రలు కాదు. వేషాలు వేస్తున్న కాలంలోనే అంతకు మించి ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. 'పూర్ణోదయా మూవీ క్రియేషన్స్' పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి, పక్కూరి అమ్మాయి జయప్రద కథానాయికగా, అప్పటికే స్నేహితుడైన కె. విశ్వనాధ్ దర్శకత్వంలో 'సిరి సిరి మువ్వ' సినిమా తీసి 1978 లో సినిమా నిర్మాత అయ్యారు ఏడిద నాగేశ్వర రావు.


అటు తర్వాతి పద్నాలుగేళ్ళ కాలంలో కేవలం పది సినిమాలు (మాత్రమే) నిర్మించి, అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకోడమే కాకుండా, తనకూ, తన సంస్థకూ తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీని కేటాయింపజేసుకున్నారు నాగేశ్వర రావు. తెలుగు సినిమా నలుపు తెలుపుల నుంచి రంగుల్లోకి మారిన తర్వాత వచ్చిన మొదటి పది కళాత్మక సినిమాల జాబితా వేస్తే, అందులో 'పూర్ణోదయా' వారి సినిమా లేకపోతే ఆ జాబితా అసంపూర్ణం. ఖండాంతరాల్లో ఖ్యాతి తెచ్చిన 'శంకరాభరణం' వ్యాపార పరంగా నిర్మాతకి లాభాలు తేకపోవడం సినిమా పరిశ్రమలో మాత్రమే సాధ్యమయ్యే ఒకానొక వైచిత్రి.

కుమారుడు ఏడిద శ్రీరాంని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'స్వరకల్పన' బాగా ఆడదు అని తెలిసీ విడుదల చేశానని మరో నిర్మాత అయితే చెప్పేవారు కాదేమో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పక్కూరు పసలపూడి కుర్రాడు పాతికేళ్ళ వంశీ కి దర్శకుడిగా అవకాశం ఇస్తూ తారల్ని కాక కథని నమ్మి 'సితార' నిర్మించడం నాగేశ్వరరావు అభిరుచికీ, ధైర్యానికీ కూడా నిదర్శనం. ఏడిద నాగేశ్వర రావు నిర్మించిన పది సినిమాల్లోనూ ఆరు సినిమాలకి - సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్భాంధవుడు - దర్శకుడు కె. విశ్వనాధ్. ఈయన పేరుకి ముందు 'కళా తపస్వి' వచ్చి చేరడంలో 'పూర్ణోదయా' ది కీలకపాత్ర.

కొందరు నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమని తాము మార్చుకోడానికి కాంప్రమైజ్ అవ్వగలరు. అలా అవ్వడానికి సిద్ధ పడకుండా, సినిమా నిర్మాణానికే దూరం జరిగిన కొద్దిమంది నిర్మాతల్లో నాగేశ్వర రావు ఒకరు. 'ఆపద్భాంధవుడు' తరువాత మరి సినిమాలు నిర్మించలేదు. అలాగని సినిమా పరిశ్రమకి దూరంగా జరగనూలేదు. అవార్డుల కమిటీ చైర్మన్ లాంటి ఎన్నో పదవులు నిర్వహించారు. వచ్చిపడిన మార్పుని ఆడిపోసుకోకుండా తనలాంటి వాళ్లకవి సరిపడవని ఒప్పుకుని చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారు. అయితేనేం, తెలుగు సినిమా చరిత్రలో 'పూర్ణోదయా' నాగేశ్వరరావు స్థానం పదిలం, ప్రత్యేకం. తెలుగు సినిమాకి ఇలాంటి నిర్మాతల అవసరం ఉంది, రాడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడితే అదే ఏడిద నాగేశ్వర రావుగారికి అసలైన నివాళి అవుతుంది.