బుధవారం, ఏప్రిల్ 29, 2026

మాలతీ మనోహరమ్

మాలతీ చందూర్.. తెలుగు సాహిత్యంతో ఏ కాస్త పరిచయం ఉన్న వాళ్ళకైనా ఈ పేరు పరిచయమే. 'ప్రమదావనం', 'వంటలు-పిండి వంటలు' మొదలు కథలు, నవలలు, విదేశీ సాహిత్య పరిచయపు 'పాత కెరటాలు', సాహిత్య సమీక్ష, విమర్శ వరకూ, ఎవరి శక్తి, ఆసక్తి మేరకు కొన్నో అన్నీనో జ్ఞాపకం వచ్చి తీరతాయి. నావరకూ, ఒక ఇంటర్యూలో ఆమె చెప్పిన "నా మొదటి కథ 'రవ్వల దిద్దులు'. నాకు ఏమాత్రం ప్రేమ లేని కథ" అనే మాట గుర్తొస్తూ ఉంటుంది. ఆ వెంటనే, "బహుమతి కోసం కథల్ని పరిశీలించేప్పుడు చివరి వడపోతలో ఈ కథలో అనవసరమైన వాక్యం ఏదన్నా ఉందా అని చూస్తాం. మీ కథలో అలాంటి వాక్యం ఏదీ లేదు" అంటూ శ్రీరమణ 'బంగారు మురుగు' కి ఇచ్చిన కితాబు కూడా. ఆ తర్వాతే ఆవిడ రచనలు, జవాబులు ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. అలాంటి రచయిత్రిని గురించి వచ్చిన 'ఫ్యాన్ గర్ల్ బుక్' ఈ 'మాలతీ మనోహరమ్'. 

పి. ప్రమీల హరగోపాల్ రచయిత్రి కాదు. పాఠకురాలు. మాలతీ చందూర్ ఆమెకి అభిమాన రచయిత్రి. ఎంత అభిమానం అంటే, ఉద్యోగంలో బదిలీ మీద 1991లో మద్రాసు నగరానికి వెళ్ళినప్పుడు, ప్రత్యేకంగా మాలతీ చందూర్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆమెని కలిసి వచ్చేటంత. ఆ పరిచయం అచిరకాలంలోనే స్నేహంగా మారి, చందూర్ మాలతిల చివరి క్షణాల వరకూ కొనసాగింది. ఆ దంపతులతో తన జ్ణాపకాలని నెమరువేసుకుంటూ గతేడాది ప్రమీల రాసిన ఈ పుస్తకం 'రచయిత్రి మాలతీ చందూర్' ని కొత్తగా చూపేది కాదు, అసలు రచనల ప్రస్తావనే ఎక్కడో తప్ప కనిపించదు. ఒక గృహిణిగా, స్నేహితురాలిగా -- మామూలు పాఠకులకి తెలియని ఒక కొత్త -- మాలతీ చందూర్ ని పటం కట్టి చూపిస్తుంది. ఆమె కుటుంబమూ, జీవన విధానమూ, దగ్గరి వాళ్ళూ, వాళ్ళతో అనుబంధాలూ ఇలా ఎన్నో ఆసక్తికరమైన కబుర్లని, చాలా సరళమైన శైలిలో పంచుకున్నారు ఈ పుస్తకంలో. 

"స్వతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు రిజిస్టర్ ఆఫీసులో జరిగిన మొట్టమొదటి పెళ్లి మాలతీ చందూర్ గార్లదేనట. ఈ విషయం చాలామందికి తెలియదు" లాంటి విశేషాల మొదలు, "ఈవిడేమో (మాలతి అక్క శారద, స్కూల్ టీచర్, ఇంట్లో వంట ఆవిడదే) స్కూలుకెళ్లే ముందు మినప్పప్పు నానబెట్టి, నేను పర్మిషన్ తీసుకుని మూడుకల్లా వస్తాను అని చెప్పి నాలుగైనా రాలేదు. అందుకని తను వచ్చేసరికి గారెల పిండి కనీసం రుబ్బి పెడదామని మిక్సీలో వేసి, నీళ్లు ఎక్కువై కాస్త పల్చబడితే బియ్యం పిండి వేసేశాను" అని చెప్పగా, చందూర్ గారు "వంటలు-పిండి వంటలు మాలతీ చందూర్" అని కిసుక్కున నవ్వడం లాంటి సరదా కబుర్ల వరకూ ఎన్నో, ఎన్నెన్నో. మాలతీ చందూర్ ఇంట్లో ఏనాడూ వంట చేయలేదు (బాపూ కార్టూన్లు బోల్డన్ని, నేరుగా 'సలహాల కాలమ్ మాలతి గారు' అని పేరు పెట్టి, వాటి ప్రస్తావన ఏదీ లేదీ పుస్తకంలో), కానీ ఆవిడ రచనలన్నింటిలోనూ ఎక్కువ రాయల్టీ తెచ్చిపెట్టిన పుస్తకం 'వంటలు-పిండి వంటలు'. 

ఇదిగో, ఈ శారదక్కకి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడవ్వడం వల్లనే, 'హృదయనేత్రి' నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన బహుమతిని స్వయంగా అందుకోలేకపోయారట మాలతీ చందూర్. ఆమె తరపున, స్నేహితురాలు రాధా శివస్వామి అందుకున్నారా పురస్కారాన్ని. అలాగే, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ప్రభుత్వ పురస్కారం అందుకోడానికి వచ్చిన మాలతి, చందూర్ల మీద వారి హోటల్ గదిలో ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసి, ఆమె నగలు, ఆయన పర్సు ఎత్తుకుపోయిన సంగతిని వివరంగా ప్రస్తావించారు ప్రమీల. "ఆ సాయంత్రం రవీంద్రభారతిలో సన్మానం చేస్తూ ఆవిడని స్టేజీ పైకి ఆహ్వానిస్తే, ఆవిడ తన రెండు చేతులూ మోచేతి వరకూ పైకెత్తి చూపుతున్నట్టుగా పెట్టుకుని వెళ్లేసరికి, ఒక్క క్షణం  ఎన్టీ రామారావు గారు ఏంటా అనుకుని, వెంటనే 'రెండు చేతుల గాజులేవి' అన్నారట. వెంటనే ఈవిడ 'మీ హైదరాబాదు లో దిగగానే పొద్దున్నే మొదటి సన్మానం జరిగింది' అంటూ చెప్పేసరికి, మూడో నాటికల్లా వాళ్ళ వస్తువులు వాళ్లకి దొరికి మద్రాసు తిరిగి వెళ్లారు." 

సీరియస్ పాఠకులపై సాహిత్యం చూపే ప్రభావం ఎలాంటిదో ఒక్కోసారి రచయితలు కూడా ఊహించలేరు. మాలతీ చందూర్ 'శతాబ్ది సూరీడు' నవల విషయంలో ప్రమీల అనుభవాన్ని, ఆమె ముఖతా విన్న మాలతి అనుభవం అలాంటిదే. అలాగే, 'ఆంధ్రప్రభ' వారపత్రిక వాళ్ళు 48 ఏళ్ళ పాటు సాగిన 'ప్రమదావనం' శీర్షికని ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆపేసినప్పుడు, ప్రమీల మొదలు పెట్టిన సంతకాల ఉద్యమం, ఆ తాలూకు పర్యావసానాలు ఆసక్తిగా చదివిస్తాయి. 'చందూర్ మామ' కబుర్లనీ చాలానే పంచుకున్నారు ప్రమీల. తొంభయ్యేళ్ళ వయసులో కూడా, హెయిర్ డై చేసుకుని, ఐబ్రో పెన్సిల్ తో కనుబొమలు దిద్దుకున్నాక గానీ బయటికి అడుగు పెట్టకపోవడం లాంటి సరదా సంగతుల మొదలు, అభిమానులు తలపెట్టిన 'నవలా మాలతీయం' ప్రాజెక్టుకి గట్టిగా అడ్డు చెప్పడం (ఆ సందర్భంలో మాలతి చూపిన సంయమనం, చేసిన సర్దుబాటు) లాంటి సీరియస్ విషయాల వరకూ చందూర్ ప్రస్తావన అనేకచోట్ల కనిపిస్తుంది ఈ పుస్తకంలో. 

వంశీ 'లేడీస్ టైలర్' సినిమాలో రాళ్ళపల్లి పోషించిన కోయదొర పాత్ర, ఓ ఫోటో ఆల్బమ్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది, "చిరంజీవి, పక్కన్నేను" అనే డైలాగుతో. మన ప్రస్తావన పెద్దగా లేకుండా, కేవలం అవతలి వాళ్ళని గురించి మాత్రమే చెప్పడం కత్తిమీద సాము. రచయిత్రి కాకపోవడం వల్ల కూడా కావచ్చు, ఈ సాముని అలవోకగా చేసేశారు ప్రమీల. అత్యవసరమైన చోట మాత్రమే తన గురించి చెప్పడం మాత్రమే కాదు, పొందిన మెచ్చుకోళ్ళ కన్నా వేయించుకున్న అక్షింతలనే ఎక్కువ ప్రస్తావించారు. ఇందువల్ల కూడా కథనం ఎక్కడా దారితప్పలేదు, ఏపేజీ కూడా విసుగుని కలిగించలేదు. ఒక సంయమనం నిండిన గొంతుతో చెప్పారు మాలతి చందూర్ కబుర్లని. ముందే చెప్పినట్టుగా ఇది 'ఫ్యాన్ గర్ల్ బుక్'. మాలతీ చందూర్ అభిమానులందరూ చదివి, దాచుకోవాల్సిన పుస్తకం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చదువుకునే విశేషాలతో పాటు, చదివించే గుణమూ పుష్కలంగా వుంది ఈ 'మాలతీ మనోహరమ్' లో. ఎమెస్కో ప్రచురించిన ఈ 126 పేజీల పుస్తకం వెల రూ. 125. ఆన్లైన్ లో కూడా దొరుకుతోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి