బుధవారం, అక్టోబర్ 07, 2020

కొన్ని సమయాలలో కొందరు మనుషులు 

గంగ ఇప్పుడు పుట్టి ఉంటే ? ..యాభయ్యేళ్ళ నాటి నవలల్ని ఇప్పుడు చదువుతుంటే తరచూ వచ్చే ప్రశ్నలు ఇలాంటివే. ఆ పాత్రలు ఇప్పుడు పుట్టి ఉంటే? అనో లేక ఆ కథ ఈ కాలంలో జరిగి ఉంటే? అనో. దీనర్ధం ఆయా రచనలు అవుట్ డేటెడ్ అని ఎంతమాత్రం కాదు, ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మర్చిపోలేనివీ, వెంటాడుతూ ఉండేవీ కాబట్టే వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, మరింతగా ఆలోచించడమూను. సరిగ్గా యాభయ్యేళ్ళ క్రితం డి. జయకాంతన్ రాసిన తమిళ నవల ' సిల నేరంగళిల్, సిల మనితర్గళ్' లో నాయిక గంగ. తమిళ మూలం విడుదలై, సంచనలం సృష్టించి, అదే పేరుతో వచ్చిన సినిమాలో గంగగా నటించిన లక్ష్మికి జాతీయ అవార్డు వచ్చాక, ఆ నవలని  'కొన్ని సమయాలలో కొందరు మనుషులు' పేరిట తెనిగించారు విదుషి మాలతీ చందూర్. ఈమధ్యే కంట పడిన ఆ పుస్తకాన్ని మరోమారు చదువుతుంటే, మళ్ళీ వచ్చిన ప్రశ్నే 'గంగ ఇప్పుడు పుట్టి ఉంటే?' నిజానికిది గంగ ఒక్కదాని కథే కాదు, ఆమె చుట్టూ ఉండే అందరి కథాను. 

ఓ సంప్రదాయపు పేదింటిలో పుట్టిన గంగ మద్రాసు కాలేజీలో చదువుతూ ఉండగా, ఓ వర్షపు సాయంత్రం ఓ ధనవంతుడైన యువకుడు ఆమెకి తన కారులో లిఫ్ట్ ఇస్తాడు. ఆ కారులోనే వాళ్లిద్దరూ ఒక్కటౌతారు. ఆమెని ఇంటి దగ్గర దింపేసి తన దారిన వెళ్ళిపోతాడు. కనీసం అతని పేరుకూడా తెలీదు గంగకి. తమ మధ్య జరిగిందేవిటో తల్లి కనకానికి చేప్పేస్తుంది గంగ. బిగ్గరగా ఏడుపు ఆరంభిస్తుంది ఆ తల్లి. చుట్టుపక్కల అందరికీ విషయం తెలిసిపోతుంది. గంగని ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఆమె అన్న గణేశన్. కొడుకుని కాదని కూతురితో పాటు బయటికి వచ్చేస్తుంది కనకం. మేనమామ వరసైన న్యాయవాది వెంకటేశ అయ్యంగార్ గంగకి తంజావూరులోని  తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి చదివిస్తాడు. యూనివర్సిటీ టాపర్ అయిన గంగకి ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం రావడంతో తిరిగి మద్రాసులో అడుగు పెడుతుంది. అన్నావదినలకి దూరంగా తల్లితో కలిసి వుంటుంది. 

తన కూతురికి పెళ్లి జరిగే రాత లేదని కనకానికి స్థిర నిశ్చయం. 'వెంకూ అన్నయ్య' దయవల్ల తన కూతురికి బతుకుతెరువు దొరికిందనీ, ఆమె నీడన తన జీవితం కూడా వెళ్ళిపోతుందనీ భావిస్తూ ఉంటుంది. జరిగినదాని పట్ల ఓ తల్లిగా ఆమెకి బాధ ఉంది, అంతకు మించి గంగకి తాను ఏమన్నా చేయగలనా అన్న ఆలోచన లేదు. ఇక గణేశన్ పనల్లా చెల్లెలి గురించి వినిపించే పుకార్లని మరింతగా ప్రచారంలో పెట్టడం, తానే స్వయంగా వచ్చి తల్లి చెవిన వేస్తూ ఉండడం. అలాగని గంగ సంపాదన మీద అతనికి ఆశ లేదు. తల్లిని ఏనాడూ రూపాయి చేబదులు అడగలేదు. అతని భార్యకైతే గంగ మీద అకారణ ద్వేషం. వేంకటేశ అయ్యంగార్ దృష్టిలో గంగ తను మలిచిన బొమ్మ. ఆమె మీద తనకి అధికారం ఉన్నదనే భావిస్తూ ఉంటాడు. ప్రాచీన ధర్మాలని అలవోకగా వల్లెవేసే, పిల్లలు లేని ఆ ప్లీడరు గంగలో కూతుర్ని కాక, స్త్రీని చూస్తూ ఉంటాడు. అవకాశం కోసం కాసుకునీ ఉంటాడు. 

ఇంతకీ గంగ ఏమనుకుంటోంది? ఆమెకి మగవాళ్ల పట్ల విముఖత. ఆమెకి తారసపడే వాళ్ళ చూపులు, చర్యలూ ఆ వైముఖ్యాన్ని మరింత పెంచుతూ ఉంటాయి. 'వెంకూ మామయ్య' మనసులో ఏముందో ఆమెకి తెలుసు. ఆశ్రయం ఇచ్చాడన్న గౌరవం ఉంది. అంతకు మించి అతని చర్యల పట్ల అసహ్యమూ ఉంది. అతన్ని హద్దు దాటనివ్వకుండా ఉంచడం ఎలాగన్నది ఆమె నేర్చుకుంది. గంగకి ఈ జాగ్రత్తని బోధించింది స్వయానా వెంకూ భార్యే. గంగ ఎవరికన్నా ఉంపుడుగత్తెగా ఉండేదుకు తప్ప, భార్య అయ్యేందుకు అర్హతని కోల్పోయిందని తీర్మానిస్తాడు వెంకూ. దాని వెనుక ఆమె తనకే ఉంపుడుగత్తె కావాలన్న ఆలోచన ఉన్నదని గంగకి మాత్రమే తెలుసు. గంగకి చేతనైతే ఆవేళ ఆమెని కార్లో తీసుకెళ్లిన వాడిని వెతికి పట్టుకోవాలని, కనకం దగ్గర ఛాలెంజి చేస్తాడు వెంకూ. ఈ ఛాలెంజి గంగ చెవిన పడుతుంది. అనూహ్యంగా, ఆ వ్యక్తిని వెతికి పట్టుకోడానికి నిశ్చయించుకుంటుంది గంగ. 

పన్నెండేళ్ల తర్వాత అతన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంది గంగ. అతని కారు తప్ప, ముఖం కూడా గుర్తు లేదామెకి. ఆర్నెల్ల ప్రయత్నం తర్వాత ప్రభూగా పిలవబడే ప్రభాకర్ని వెతికి పట్టుకుంటుంది. అతను సంఘంలో గౌరవనీయుడు. ఓ టీనేజ్ అమ్మాయి మంజుకి తండ్రి. భార్య పద్మ, మరో ఇద్దరు మగపిల్లలు. అనూహ్యంగా గంగకి, ప్రభుకి స్నేహం కుదురుతుంది. తాను చేసిన పని పట్లా, దాని పర్యవసానం పట్లా పశ్చాత్తాపం కలుగుతుంది ప్రభులో. తగిన వరుణ్ణి చూసి గంగకి పెళ్లి చేయాలని అతని ప్రయత్నం. వెంకూ మామయ్య ప్రవచనాల ఫలితం వల్ల కావొచ్చు, గంగ దృష్టిలో మరో మగవాడు లేడు, ప్రభు తప్ప. అలాగని అతనితో సంబంధానికి ఆమె వ్యతిరేకి. కానీ, అతని మనిషిగా ముద్ర వేయించుకోవాలని తనంత తానుగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుతో పరిచయం తర్వాత గంగలో వచ్చే మార్పు ఈ నవలకి ఆయువుపట్టు అని చెప్పాలి. ఆమె అంతః సంఘర్షణ నవల చదివే పాఠకులకి తప్ప, ఆమె చుట్టూ ఉన్న ఎవరికీ అర్ధం కాకపోవడం ఒక విషాదం. 

ప్రభుతో గంగ స్నేహాన్ని సంఘం మాత్రమే కాదు, కనకం కూడా అంగీకరించదు. ప్రభు భార్య అతన్ని పట్టించుకోడం ఏనాడో మానేసింది. ఆమె జాగ్రత్తల్లా ఆస్తిని కాపాడుకోవడం, పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడం. మంజుకి గంగకి స్నేహం కుదురుతుంది. మంజు మగ స్నేహితుల గురించి విన్నప్పుడు తరంతో పాటు స్త్రీ-పురుష సంబంధాలని గురించి యువత ఆలోచనల్లో వచ్చిన మార్పులని అర్ధం చేసుకుంటుంది గంగ. ప్రభు ఆమెకి మానసికంగా దగ్గరయ్యే సమయానికి గంగ జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు జరగడం, అటుపైన గంగ జీవితం ఊహకందని విధంగా మారిపోవడం ఈ నవల ముగింపు. నిజానికి ఈ నవలకి కొనసాగింపుగా మరో నవల రాశారు జయకాంతన్. మనస్తత్వ విశ్లేషణ మీద జయకాంతన్ కి ఉన్న పట్టుని గురించి కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదు. తెలుగు నవలేమో అనిపించేలా అనువదించారు మాలతీ చందూర్. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఆర్కీవ్స్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

4 కామెంట్‌లు:

  1. మురళిగారు.. మీ పుస్తకపరిచయం / విశ్లేషణ హృద్యంగా ఉంది, ఎప్పటిలాగానే..

    ఇకపోతే..

    మీరింతకుముందు "ఆర్కైవ్స్" లంకె ఇచ్చినా నేను గమనించలేదు అనుకుంటా. కానీ అదో పెద్ద భాండాగారంలా ఉంది. పంచుకున్నందుకు ధన్యవాదాలు.. 🙏

    రిప్లయితొలగించండి
  2. నమస్తే,
    చాలా మంచి పరిచయం ఈ నవల ఆన్లైన్ లో ఉందా చెప్పగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే.. నా టపాలోనే లంకె ఇచ్చాను చూడండి. ధన్యవాదాలు 

      తొలగించండి