సోమవారం, ఆగస్టు 17, 2020

అక్షరాంజలి

'నేనెవర్ని?' 'నన్ను నడిపించే శక్తి ఏమిటి?' ఆలోచనాపరులందరికీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురవ్వక తప్పని ప్రశ్నలివి. అతికొద్దిమందిని ఏళ్ళ తరబడి వెంటాడే ప్రశ్నలూ ఇవే. మహర్షులు, మహాత్ముల జీవిత చరిత్రల్ని పరిశీలిస్తే, వాళ్ళ ప్రయాణం మొదలయ్యిందీ ఈ ప్రశ్నలతోనే అని తెలుస్తుంది మనకి. 'అనామకుడు' అనే కలంపేరుతో కథలు, నవలలు రాస్తున్న ఏ. ఎస్. రామశాస్త్రి చేత 'అక్షరాంజలి' అనే చిరుపొత్తాన్ని రాయించింది కూడా ఈ ప్రశ్నలే అనిపించింది, పుస్తకం చదవడం పూర్తి చేయగానే. భౌతికశాస్త్రంలో అత్యున్నత విద్యాభ్యాసం చేసి, భారతీయ రిజర్వు బ్యాంకులో ఉన్నతోద్యోగం చేసి, ఆర్ధిక శాస్త్రాన్ని గురించి ఆంగ్లంలో గ్రంధాలు రాసి, మధ్యమధ్యలో మాతృభాషలో కథలు, నవలలు రాసిన 'అనామకుడు' తన  'అక్షరాంజలి' ని పాఠకులకి అందించే మాధ్యమం గా పద్యాన్ని ఎంచుకున్నారు. 'చదువులలోని సారమెల్ల' చదవడం అంటే ఇదేనేమో. 

అరవై పేజీల పుస్తకాన్ని 'అక్షరాంజలి', 'ఆత్మ నివేదన', 'నీ వినోదం', 'మా సందేహం', 'నీ విలాసం', 'ఉపనిషత్తులు', 'సనాతన విజ్ఞానం', 'నా విన్నపం' అనే ఎనిమిది అధ్యాయాలుగా విభజించడంతో పాటు, తాను ప్రస్తావించిన అంశాల తాలూకు వివరణలతో ఓ 'అనుబంధం' ని కూడా జతచేశారు. "అరవై సంవత్సరాలుగా ఈ సృష్టి నన్ను అనుక్షణం అబ్బురపరుస్తూనే ఉంది. ఆనందంలో ముంచెత్తుతూనే ఉంది.." అని చెబుతూ,  "సృష్టికర్త ప్రేరణతోనే సృష్టిలో నేను చూస్తున్న విశేషాలనీ, వింతలనీ సృష్టికర్తకు విన్నవించుకునే ప్రయత్నం మొదలు పెట్టాను. ఆ ప్రయత్న ఫలితమే ఈ అరవై పద్యాల అక్షరాంజలి" అంటూ ఈ రచన వెనుక తన ప్రేరణని వచన రూపంలో వివరించి, అక్కడి నుంచి అత్యంత సరళమైన పద్యాలతో 'ఆత్మనివేదన' ఆరంభించారు కవి. 


"ఇచ్చితివీవు భోజ్యములు - ఇచ్ఛితి నీకు నివేదంబుగా/ ఇచ్చితివీవు పుష్పములు - ఇచ్ఛితి నీకు సుమమాలగా/ ఇచ్చితివీవు విద్యలను - ఇచ్చుచుంటిని పద్యమట్లుగా/ ఇచ్చిన  నీకె  ఇచ్చుటను - ఎంచక తప్పుగా స్వీకరించుమా" ..బహుశా 'నేను' నుంచి బయటికి వచ్చే క్రమంలో ఈయన చాలా దూరమే ప్రయాణం చేశారనిపించింది ఈ పద్యం చదువుతుంటే. 'నీ వినోదం' అధ్యాయంలోని పదకొండు పద్యాలూ మనకెప్పుడూ మామూలుగా అనిపించే ప్రపంచాన్ని, కొత్తగా చూపిస్తాయి. తారలు, కృష్ణ బిలాలతో కూడిన సౌర కుటుంబం మొదలు, క్రమం తప్పకుండా జరిగే ఉదయాస్తమయాలు, మానవ శరీర నిర్మాణం, సృష్టిక్రమం, ఒకే శరీర భాగాలతో పుట్టిన మనుషుల రూపురేఖల్లో స్థూలమైన, సూక్ష్మమైన తేడాలు.. వీటన్నింటినీ నిబిడాశ్చర్యంతో పరిశీలిస్తూనే, ఆటను సృష్టిచేసి, నియమావళి ఏర్పాటు చేసి ఆడనిచ్చేదీ, అందులో గెలవనిచ్చేది కూడా నువ్వే అంటారు సృష్టికర్తతో. 

మనందరికీ చూసే కళ్ళు, వినే చెవులు, ఆలోచించే మెదడు ఉన్నాయి. మన వివేచనతో మనం నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఈ నిర్ణయాలన్నీ మనవేనా లేక మనల్ని సృష్టించి, తన ఆటలో మనల్ని పావుల్ని చేసి ఆడించే సృష్టికర్తవా? ఇవే ప్రశ్నలు సంధించారు 'మా సందేహం' అధ్యాయంలో. 'నీ విలాసం' అధ్యాయం కూడా ఇవే ప్రశ్నలకి కొనసాగింపుగా అనిపిస్తుంది. "ఉపనిషత్తులలో కొన్ని కథలు అవాస్తవంగా కనిపించవచ్చు. కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టు అనిపించవచ్చు. ఐతే మనం ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు - అవి ఏ కాలంలో, ఏ పరిస్థితుల్లో చెప్పబడ్డాయో ఆలోచించుకోవాలి" అంటూ చేసిన సూచన, కేవలం ఉపనిషత్తుల విషయంలోనే కాదు సాహిత్య అధ్యయనానికి  కూడా వర్తిస్తుంది. 

ఈశ, కేన, కఠ, ప్రశ్నాది  దశోపనిషత్తుల సారాన్ని చిన్న చిన్న పద్యాల రూపంలో అందించడం వెనుక కవి/రచయిత  చేసిన కృషి అంచనాకి అందదు. "అనుకున్నది జరుగనపుడు/ అనుకోనిది జరిగినపుడు ఆరటపడకన్/ మనకది ప్రాప్తంబనుకొన/ మనసున సం'తృప్తి ' నింపు మాకందరికిన్" అంటారు 'నా విన్నపం' లో. అదంత సులువుగా సాధ్యమయ్యేదా? ఎన్ని దెబ్బలు తినాలి, ఎంత సాధన చేయాలి?? మొత్తంమీద చూసినప్పుడు, రెండు భిన్న ప్రపంచాలుగా అనిపించే భౌతిక శాస్త్రాన్ని, సనాతన ధర్మాన్నీ కలగలిపి పద్య రచన చేయడం ఈ పుస్తకం ప్రత్యేకత అనిపించింది. తెలియని విషయాలు చెప్పడం కన్నా, అందరికీ బాగా తెలిసిన విషయాలనే బాగా అర్ధమయ్యేలా చెప్పడమే ఎక్కువ కష్టమేమో కూడా అని మరోమారు అనిపించింది. ఈ పుస్తకాన్ని చదవాలనుకునే వారు 'కినిగె' నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కవి/రచయిత గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు. 

3 కామెంట్‌లు: