మంగళవారం, జనవరి 19, 2016

వాళ్ళు వెళ్ళిపోయాక ...

మృత్యువుని అల్లుకుని ఉండే రాజకీయాలు ప్రతిసారీ  ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఆప్తుల మరణాలని, అనంతరం జరిగే అనేకానేక పరిణామాలని దగ్గర నుంచి చూడడం కొత్త కాకపోయినా, చూసిన ప్రతిసారీ అనేక కొత్త ఆశ్చర్యాలు, మరెన్నో ప్రశ్నలు చుట్టుముడుతూ ఉంటాయి. మిగిలిన ప్రపంచం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో దగ్గరవాళ్ళిద్దరు రెండు రోజుల తేడాతో దూరమయ్యారు. ఇద్దరూ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న వాళ్ళే కాబట్టి, వాళ్ళ మరణం ఊహాతీతం కాదు.

నిజం చెప్పాలంటే ఇద్దరి కుటుంబ సభ్యులు, బంధువులూ, స్నేహితులూ మరణ వార్త వినడానికి మానసికంగా సిద్ధపడే ఉన్నారు. అయితే, అంత్యక్రియల తతంగం - వాడుక భాషలో కర్మకాండ - ముగియక మునుపే రాజకీయాలు మొదలయ్యాయి. దశ దిన కర్మ పూర్తయ్యే వరకూ ఆస్తిపాస్తులు, వారసత్వాల సంగతులు బహిరంగంగా చర్చకి వచ్చే సంప్రదాయం కాదు కాబట్టి, తెరవెనుక అనేకానేక సంగతులు జరుగుతున్నాయి. పోయిన వాళ్ళతో ఉన్న దగ్గరతనం దృష్ట్యా, జరుగుతున్న సంగతులు వద్దన్నా నా చెవిన పడుతున్నాయి.

పోయిన ఇద్దరిలో ఒకాయన కొడుకులంటే ఆయన సర్కిల్ లోనే ఉన్న ఒకానొక పెద్దమనిషికి సరిపడదు. వాళ్ళని మాట అనే అవకాశం కోసం కాసుకుని ఉంటాడు. తండ్రి బతికి ఉన్నంతకాలం తన పిల్లల మీద ఈగ వాలనివ్వలేదు. ఆ కట్టె కాలిపోవడంతోనే, పెద్దమనిషి ప్రచారం మొదలయ్యింది. "చివరి క్షణాల్లో పిల్లలెవరూ దగ్గర లేరు.. తులసి నీళ్ళు నేనే పోశాను.. పోనీలే, ఆ పుణ్యం నాకు దక్కింది.." తన కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ పనికట్టుకుని ఫోన్ చేసి మరీ చెబుతున్నాడు. అది పచ్చి అబద్ధమని తెలిసిన వాళ్ళు కొద్దిమందే. మిగిలిన వాళ్ళిప్పుడు అది నిజమేనా అన్న సందిగ్ధంలో ఉన్నారు.

పెద్దమనిషి ఫోన్ అందుకున్న ఒకాయన ఫోన్ చేసి "ఆ తండ్రి తన పిల్లని ఎంత ప్రేమగా చూసుకున్నాడు.. వాళ్ళు చూడండి, ఆయన అవసరానికి అక్కరకి రాకుండా పోయారు.." అంటూ మొదలు పెట్టి, లోకం మీద కొడుకులందరినీ దుమ్మెత్తిపోయడంతో అవాక్కవ్వడం నా వంతయ్యింది. ఇక వినలేక, అసలు జరిగిందేమిటో, సదరు పెద్దమనిషి సమస్యేమిటో కుండ బద్దలుకొట్టేశాను. కానైతే, నా మాట నమ్మాలని ఏముంది? ఆ పోయినాయాన్ని అడ్డం పెట్టుకుని, "ఆయన నన్నప్పుడు అలా మెచ్చుకున్నాడు.." అంటూ స్వోత్కర్షలు.. అసలు విషయాలు తెలిసి, ఈ అబద్ధాలు వినడం ఎంత కష్టం అసలు..

ఇక, రెండో చోట పరిస్థితి మరీ దారుణం. మూడేళ్ళ పాటు కష్టపడి సొంత ఇల్లు కట్టుకుని, ఇల్లు పూర్తవుతున్న సమయంలో తీవ్రంగా అనారోగ్యం చేసి నడివయసులోనే ప్రాణం వదిలాడాయన, అది కూడా వృద్ధులైన తన తల్లిదండ్రుల సమక్షంలో. ఆ తల్లిదండ్రులకెంత క్షోభ.. ఆ కుటుంబానికి శ్రేయోభిలాషిగా చెప్పుకునే పెద్దమనిషికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. అంత్యక్రియలన్నా పూర్తి కాకమునుపే పంచాంగం తిరగేసి, "పోయిన ముహూర్తం అస్సలు మంచిది కాదు.. ఇల్లు పాడు పెట్టకపోతే పెద్ద ప్రాణాలు రెంటికీ ప్రమాదం.." అని అందరినీ చూస్తూ ప్రకటించాడు.

అక్కడితో ఆగలేదు. "కొంత డబ్బు అప్పుతెచ్చి కట్టారు ఇల్లు.. ఇప్పుడు తీర్చలేరు కదా.. బేంకు వాళ్ళు వేలానికి పెట్టేస్తారేమో.. చూసుకోవాలి.." అంటూ ప్రసంగిస్తూ ఉంటే, చుట్టూ ఉన్న అందరూ అతనివైపు అసహ్యంగా ఓ చూపు చూసి, జరగాల్సిన కార్యక్రమం వైపు దృష్టి పెట్టారు. 'నలుగురిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాలనే కోరిక వీళ్ళ చేత ఇలా అసందర్భంగా మాట్లాడేలా చేస్తుందా?' అన్న ఆలోచన మాత్రం తెగలేదింకా..

2 కామెంట్‌లు:

  1. మృత్యువు చుట్టూ రాజకీయాలంటే నేనింకా సెంట్రల్ యూనివర్సిటీ ఉదంతం గురించి మాట్లాడుతున్నారనుకున్నా..

    ఔనండీ! నిజంగా ఒక్కోసారి మనిషిలోని మూర్ఖత్వం(అనే అనిపిస్తుంది నాకైతే) ఎంతగా వెర్రితలలు వేస్తుందోననిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు/విన్నప్పుడు..

    ఈ ఆచారాలు అవి మనిషి బాగుకోరి వచ్చినవే. అన్నీ మనిషి సృష్టించినవే కనుక సృష్టించిన మనిషికి వాటిని మార్చుకునే హక్కు కూడా ఉంటుందని గ్రహించక ఏవేవో చేస్తూ ఉంటారు..
    ఇలాంటి నమ్మకాలున్న వారు,ఆ పెద్దాయన ఎంతో శ్రమ పడి కట్టిన ఇంటికి పాడుబెడితే ఆయన ఆత్మ ఎంతగా క్షోభిస్తుందోనన్న ఆలోచన చేయలేరెందుకో!

    నాకు తెలిసినవాళ్ళలో ఒకరు, ఏవో కష్టాలొచ్చాయని, తరాల తరబడి ఉంటున్న ఇంటిని వాస్తు పేరిట కూల్చేసి, అప్పులు చేసి మరీ ఇంటిని సమూలంగా తిరిగి కట్టుకున్నారు. పోతే కష్టాలు మరింత ఎక్కువయ్యాయి తప్ప తగ్గలేదు. అయినా పాఠం నేర్చుకోలేదు. అవే నమ్మకాలతో వారికి వారే నష్టం కలిగించుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి
  2. 'నలుగురిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాలనే కోరిక..' సోషల్ మీడియాతో కలుపుకుని చాలా జాడ్యాలకి మూలకారణం ఇదే కదా! కష్టపెట్టుకోకండి..

    రిప్లయితొలగించండి