గురువారం, మే 08, 2014

ది లాస్ట్ బ్రాహ్మిన్

"పార్లమెంటుని హేళన చేసేవాడు పార్లమెంటుని ఎన్నటికీ ఏమీ చెయ్యలేడు. పార్లమెంటు అంటే ఏమిటి అని తెలుసుకోడానికి ప్రయత్నించేవాడు మాత్రమే అందుకు భిన్నమైన పని చేస్తాడు. బ్రాహ్మణ సమూహం భారతదేశంలో కనిపించని పార్లమెంటు. అదీ బ్రాహ్మణత్వమంటే.." సరిగ్గా పుష్కరకాలం క్రితం 'ది లాస్ట్ బ్రాహ్మిన్' పేరుతో రాణి శివశంకర శర్మ రాసిన తెలుగు పుస్తకం మార్కెట్లోకి విడుదల అయినప్పుడు నా చుట్టూ ఉన్న ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా స్పందించారు. వారిలో యజ్ఞోపవీతం తెంపుకుని కమ్యూనిస్టు ఉద్యమంలో తలమునకలుగా పనిచేస్తున్నవారి మొదలు, సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ఆధునికతని అంది పుచ్చుకున్న వారి వరకూ భిన్న నేపధ్యాలు ఉన్నవాళ్ళు. అప్పట్లో ఎన్నో చర్చలకి కేంద్రబిందువైన ఈ పుస్తకాన్ని పన్నెండేళ్ళ తర్వాత చదవడం తటస్థించింది, అదీ యాదృచ్చికంగా.

సనాతన బ్రాహ్మణ సంప్రదాయానికి చివరితరం ప్రతినిధి అయిన మహామహోపాధ్యాయ రాణి నరసింహ శాస్త్రి జీవితాన్ని గురించి, ఆయన చిన్న కొడుకు, నాస్తికుడు అయిన రాణి శివశంకర శర్మ రాసిన ఈ 241 పేజీల పుస్తకం సనాతన బ్రాహ్మణ జీవితం, హిందూ, క్రైస్తవ, బౌద్ధ ధర్మాలు, కమ్యూనిజం, నాస్తికత్వం లాంటి అనేక అంశాలని స్పృశించింది. తూర్పుగోదావరి జిల్లా ముంగండ సమీపంలోని నరేంద్రపురం అగ్రహారం లో కూలిపోడానికి సిద్ధంగా ఉన్న ఓ పాత ఇంట్లో చివరి రోజులు గడుపుతున్న నరసింహ శాస్త్రి పరిచయంతో మొదలయ్యే కథనం, ఆయన అంతిమ యాత్రతో ముగుస్తుంది.

"మహామహోపాధ్యాయ బిరుదాంకితులు మహా వేదాంత పండితులు అయిన రాణి నరసింహ శాస్త్రి గారికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు హిందువుగా మారడంతో పతనమయ్యాడు. చిన్న కొడుకు నాస్తికుడయ్యాడు. కొడుకులుండి ఫలితమేమి? మరణాంతరం ఉన్నత లోకాలకి ద్వారాలు తెరుచుకోక ఆకలితో దప్పికతో అల్లాడే ఒక మహానుభావుడి ఆత్మకి దారి ఏది?" ఇది ఆ ఇంటి పురోహితులు కామేశ్వర సోమయాజులు వ్యధ. ఎందుకంటే, హిందూ ధర్మం అనే దాన్ని ప్రచ్చన్న క్రైస్తవంగా తిరస్కరించి, సనాతన వర్ణ ధర్మాన్ని మాత్రమే జీవితాంతమూ ఆచరించారు నరసింహ శాస్త్రి.


వేదాంత శాస్త్రంలో భారత దేశంలోనే  గొప్ప పండితుడిగా భారత రాష్ట్రపతి సన్మానం అందుకున్న నరసింహ శాస్త్రి గృహస్థ జీవితం ఎలా ఉంటుంది? ఆధునికతని ఏ రూపంలోనూ గడప దాటి లోపలి రానివ్వ లేదు. డబ్బుకు ఏ మాత్రం లోటు లేకపోయినా ఆ ఇంట్లో కుర్చీలు లేవు, వాడడం నిషేధం. పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళు అయ్యేవరకూ ఆయన భార్యకి రేడియో వినడం అన్నది అతిపెద్ద తీరని కోరిక. ఇక, పిల్లల చదువుల గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. చిన్నకొడుకు పద్నాలుగేళ్ళు వచ్చే వరకూ బడి ముఖం చూడకపోయినా ఆయనకి చింతలేదు. "అదంతే, దాన్ని మార్చలేం.." ఇది ఆయనకి ఇష్టమైన పదబంధం.

బ్రాహ్మణేతరులెవ్వరినీ శిష్యులుగా అంగీకరించని నరసింహ శాస్త్రి, "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయా వహః" అన్న గీతాకారుడి భాష్యాన్ని మనసా వాచా నమ్మారు. వ్యాప్తి లేని కారణంగానే బ్రాహ్మణ్యం కుంచించుకు పోతోందనీ, త్వరలోనే అంతరించి పోబోతుందన్నది ఆయన పెద్ద కొడుకు రాణి రామకృష్ణ శర్మ వాదన. ఇతర వర్ణాలవారిని బ్రాహ్మణ్యంలో కలపడం ద్వారా బ్రాహ్మణ్యాన్ని బలోపేతం చేయాలన్న వాదనతో హిందువుగా మారిన రామకృష్ణ శర్మ, తర్వాతి కాలంలో పీఠాదిపతిగా మారారు. వీరిద్దరికీ భిన్నమైన మార్గం శివశంకర శర్మది.

కేవలం తరాల అంతరాలని గురించి మాత్రమే కాదు, బ్రాహ్మణుల్లో ఉన్న అనేకానేక శాఖలు, ఉప శాఖలని గురించీ, వాటి మధ్యలో ఉండే అంతరాలని గురించీ వివరంగా రాశారు ఈ పుస్తకంలో. ప్రముఖ కవులు రచయితలు, విప్లవ పార్టీల అభిమానులూ అయిన బ్రాహ్మణుల వివరాలు ఇస్తూ "కమ్యూనిజంలో బ్రాహ్మణులని ఆకర్షించేది ఏదో ఉంది" అంటారు శివశంకర శర్మ. శ్రీశ్రీ కవితా పంక్తుల్ని ఉదాహరిస్తూ "ఇదంతా ప్రభుసమ్మితమైన వైదిక ఉపదేశమే. సోమయాజి చేసిన మంత్రోచ్చాటనే," అంటారు. "అస్పృశ్యతను కఠోరంగా పాటించే నిష్టాపరులైన మా నాన్నగారికి ముస్లింల పట్ల వ్యతిరేకత లేదు. మా ఇంట్లో తిట్లలో శూద్ర శబ్దం దొర్లుతుందేమో కానీ, తురక అనే మాట ఉండదు" అని చెబుతూ 'కన్యాశుల్కం' నాటకంలో గిరీశాన్ని 'తురక' అనిపించడం పొరపాటు అంటారు.

నిజానికి, 'కన్యాశుల్కం' నాటకంలో గిరీశం తనని తాను నవాబు గారికి దగ్గర వాడుగా చెప్పుకుంటూ ఉంటాడు. మొదటి సన్నివేశంలో మధురవాణి తో తనకి వెయ్యి సిక్కా రూపాయల జీతంలో ముసాయిల్ ఉద్యోగం అయ్యిందని చెబుతూ "హమేషా  బాద్షా వారి హుజూర్నై ఉండడం" అని గర్వంగా చెప్పించడం, బుచ్చమ్మ తో అచ్చిక బుచ్చికలాడుతూ "గిరీశం గారి పిల్లలని తీసుకురా అని ఒకప్పుడు నవాబుగారి శలవౌతుంది" అని అనిపించడం ద్వారా గిరీశం మోజు ఎటువైపు ఉందో చెప్పకనే చెప్పారు గురజాడ. శివశంకర శర్మ మాత్రం, ఆనాటి సంస్కరణలన్నీ సనాతన ధర్మాన్ని క్రైస్తవీకరించడం తప్ప మరేమీ కాదని గ్రహించడం వల్లే గురజాడ సంస్కరణలపట్ల అంతగా మక్కువ చూపించలేదు అంటారు.

"తెలుగు సాహిత్యంలో ముస్లిం పాత్రలపై మొగ్గుతో చలం చేసిన రచనలు కూడా పూర్తిగా సనాతన ధార్మికుల ప్రభావంతో ఉన్నవే. గాయత్రీ మంత్రానికి అధమాధికారుల అర్ధం ఒకటీ, ఉత్తమాధికారుల అర్ధం ఒకటీ ఉన్నట్టుగానే చలం రచనలు కూడా లౌకికార్ధం ఒకటి పరమార్ధం ఒకటి - సామాన్యార్ధం ఒకటి, విశేషార్ధం ఒకటి కలిగి ఉంటాయి," అన్నది శివశంకర శర్మ చేసిన మరో ప్రతిపాదన. "చలం మాగ్నమ్ ఒపస్ గా భావించబడే 'మైదానం' నవల సనాతన ధర్మం పరిధులను తు.చ. తప్పకుండా పాటిస్తూ రచింపబడిందే. అందులో వ్యక్తమైన బ్రాహ్మణ స్త్రీజన పక్షపాతం సంపూర్ణంగా ఆనాటి శంకర పీఠాల ధార్మిక ఆగ్రహాన్ని అనుసరించిందే" అంటారు.


ఇంతకీ, మహామహోపాధ్యాయ రాణి నరసింహ శాస్త్రి ఎనభయ్యేళ్ల జీవితం, ఆయన చిన్నకొడుకు రాణి శివశంకర శర్మ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? "దశాబ్ద కాలానికి పైగా కుల నిర్మూలన దృక్పధంతో నేను రచనలు సాగించాను. అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన దృక్పధం గల ప్రజా సంఘాలతో కలిసి తిరిగాను. ఈనాడు కుల నిర్మూలన నినాదం అనేది యెంత భయావహమైనదో కుల నిర్మూలన అనేది ఎంత అగ్రవర్ణ హిందూ వాదమో తెలిశాక నేను ఈ గ్రంధాన్ని రాయడం అనేది నా నైతిక బాధ్యతగా, కర్తవ్యంగా భావిస్తున్నాను." ('న్యూ సిలబస్' ప్రచురణ, వెల రూ. 240).

7 కామెంట్‌లు:

  1. ఈ మధ్య ఈయనవే రెండు పుస్తకాలు (గ్రహాంతరవాసి, అమెరికనిజం) చదివి, కొన్నివిషయాల్లో బాగా తికమక పడ్డాను. ఈ ఒక్క పుస్తకమ్మాత్రం ఎక్కడా దొరకలేదు. కొంచె పోస్టులోనైనా తెప్పించుకొనే అవకాశం ఉంటే చెప్పండి ప్లీజ్!

    ఈయన రాతలు చదివి నాకు సెన్సేషనలిజం ఈయనశైలి మార్గమేమో అనుకున్నాను. తర్కాన్ని అప్రాచ్య క్రైస్తవుల అవలక్షణంగా ఈయన అభిప్రాయ పడ్డప్పుడు, చార్వాకులను మర్చిపోయారేమిటా అనుకున్నాను. బ్లాగులోకంలో దారుణమైన పదజాలంతో దూషించబడే చలాన్నీ ఆయన సాహిత్యాన్నీ, సనాతనసాంప్రదాయపు దివిటీగా అభిప్రాయ పడ్డం బొత్తిగా నాకు మింగుడుపడలేదు (చలం సాహిత్యానికీ, శంకరపీఠాల ధార్మిక ఆగ్రహానికీ గల సాపత్యమేమిటో మీకేమైనా తెలిస్తే చెప్పగలరా దయచేసి). అలాగే ఎమ్మెఫ్ హుస్సేన్‌నికూడా "ఆయన గీసిన చిత్రాలు సనాతన సాంప్రదాయంతో నూటికినూరుపాళ్ళూ అంగీకరిస్తాయి, అందులో బూతును వెదుకుతున్నవాళ్ళు christian moralityని ఆధారం చేసుకొని ఆలోచిస్తున్నవారు" అని విమర్శించారు ఈయన ఒక పుస్తకంలో. ఈయన అభిప్రాయాలు లిబరల్ మేధావులతోనే తప్ప, ఏ హిందూ మతాధికారి, పీఠాధిపతి అభిప్రాయాలతోనూ ఏకీభవించకపోవడం కొంచెం interesting అనిపించే అంశం.

    రిప్లయితొలగించండి
  2. #"పెద్ద కొడుకు హిందువుగా మారడంతో పతనమయ్యాడు."#

    పుస్తక పరిచయం బాగుంది. కాని శాస్త్రి గారి కొడుకు శర్మ గారు హిందువుగా "మారడం" అంటే అర్ధం కాలేదు.

    ఇంకా, "మారడం" వల్ల ఎలా "పతన" మయ్యాడో కూడా క్లుప్తంగా చెప్తే బాగుండేది.

    రిప్లయితొలగించండి
  3. @Inconoclast: సనాతన ధర్మ పీఠాలకి ముస్లిం మతం పట్ల అభ్యంతరాలు లేవని చెబుతూ "తమ స్త్రీలని ధైర్య సాహసాలతో తీసుకు పొమ్మని చలం తన రచనల నిండా సూచనలు చేశాడు" అంటారండీ రచయిత. ఈ పుస్తకంలో కూడా తికమకలు బాగా ఎక్కువ. ముఖ్యంగా ఎవరి అభిప్రాయాలు ఏవి అన్నది తెలుసుకోడానికి ఒకటికి రెండు సార్లు చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే, పునరుక్తులు కూడా ఎక్కువే. ఓపిగ్గా చదవాలి. కాపీల కోసం 0866-862121, 040-3157252 నెంబర్లని సంప్రదించమని ఉందండీ పుస్తకంలో. పుష్కర కాలం నాటి నెంబర్లు, ఇప్పుడు మనుగడలో ఉన్నట్టు లేవు మరి. ప్రయత్నించండి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  4. @విన్నకోట నరసింహారావు: రచయిత అంతకన్నా వివరించలేదండీ.. ఆ అభిప్రాయం, ఆ కుటుంబపు పురోహితుడిది.. తండ్రి అవలంబించిన ధర్మాన్ని కాక, హిందూ మతం వైపు వెళ్ళడం ఆ పురోహితుడికి పతనంగా అనిపించిందేమో బహుశా. ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. ఇప్పుడు మనం హందూ మతం అంటున్నది బయటి నుచి వచ్చిన వాళ్ళు అంటే ముస్లిములూ ఆంగ్లేయులూ ఇక్కడ పాటిస్తున్న మతానికి పెట్టిన పేరనీ, ఆదిలో హిందూ మతం అనేది కాక సనాతన ధర్మం అనేది మాత్రమే నిజమనే వాదన ఒక వాదన ఉంది. ఈ పుస్తకం రచయిత యొక్క తండ్రి గారు అదే అభిప్రాయం లో ఉండి ఉండొచ్చు.తన తండ్రి గారి దృష్టిలో పెద్ద కొడుకు చెడిపోయినట్టు రచయిత వ్యంగంగా వ్యాఖానించినట్టు నాకు తోస్తున్నది.

    రిప్లయితొలగించండి
  6. అబ్బా చాలా కాలం తర్వాత మీ బ్లాగ్(ఇంకా చెప్పలంటే నెట్ కు) కు వచ్చినందుకు మంచి పుస్తకం గురించి చదివే అవకాశం వచ్చింది. ఈ పుస్తకం నెను చాలా కాలం కిందట చదివాను. మీరు ఇంకొంచెం ఎక్కువ రాస్తే బాగుండెది.
    ఈ మధ్య నేను ఎదొ ఒక నీలం చందమామ రోజుల్లోనే నెట్ కి వస్తుండటం జరుగుతోంది. అప్పుడైనా మీ బ్లాగుల్లో పాత టపా ఏదైనా చదువుక్కుందాం అంటె వెతుక్కోవడం కష్టం గా ఉంది. మీ లేబులింగ్ ప్రకారం సాహిత్యం టపాలు అన్నీ వచ్చినా, వాటిలో నాకు కావాల్సిందొ, లేక ఎప్పుడో చదివిందొ కావాలంటే వెనక్కి వెళ్ళతం తప్ప వేరే దారి లేదు. ప్రతి లెబుల్ క్రిందా మల్లీ అయా టపాలు డేట్స్ వారీ గా వచ్చే సదుపాయం ఏమైనా ఉందేమో కాస్త కనుక్కొని పెట్టచ్చు కదా, నా లాంటి వారి కోసం?

    రిప్లయితొలగించండి
  7. @హరిబాబు: అవునండీ.. పుస్తక రచయిత తండ్రిగారి అభిప్రాయం కూడా అదే. 'పతనమయ్యాడు' అన్నది ఆ ఇంటి పురోహితుడి అభిప్రాయం అండీ.. ధన్యవాదాలు.
    @Ruth: ఈ మధ్య కనిపించడం లేదు అనుకుంటున్నా.. ఇంతలో కనిపించారు.. చాలా సంతోషం అండీ.. పోస్ట్స్ ఇప్పుడు డేట్ వైజ్ వస్తున్నాయి కదండీ.. అంటే ప్రతి లేబుల్ లోనూ తాజా గా రాసినవి మొదట, పాతవి ఆ వెనుకే కనిపిస్తున్నాయి.. లేబుల్ మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయడమే.. ఇంతకన్నా సింపుల్ పధ్ధతి ఏదన్నా ఉందేమో చూస్తాను.. ఇక పుస్తకం గురించి, నేను మరో ఇంత రాసినా మీరు ఇదే మాట అనేవాళ్ళు.. పుస్తకం అలాంటిది మరి!! ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి