ఆదివారం, నవంబర్ 27, 2016

ఓ కాపీ కథ

దినపత్రికల ఆదివారం అనుబంధాల్లో మంచి కథలకోసం వెతికే వాళ్ళని 'ఆంధ్రజ్యోతి,' 'సాక్షి' సాధారణంగా నిరాశపరచవు. తరచుగా మంచి కథలు, అప్పుడప్పుడూ గొప్ప కథలూ వస్తూ ఉంటాయి ఈ రెండు పత్రికల్లోనూ. కథల ఎంపికలో వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని వాళ్ళ ఎంపిక తెలియజెపుతూ ఉంటుంది. అయితే, ఇవాళ్టి ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఫక్తు కాపీ కథ ప్రచురితమవ్వడం, అదికూడా ఆంధ్రజ్యోతిలో కావడం ఓ పట్టాన మింగుడు పడ్డం లేదు. ఆ కథను గురించి చెప్పేముందు మూలకథని ఓసారి తల్చుకోవాలి.

'మా పసలపూడి కథలు'కి ముందు వంశీ రాసిన కథలతో వచ్చిన సంకలనం పేరు 'ఆనాటి వానచినుకులు.' రంగుల బొమ్మల హడావిడి లాంటి హంగులేవీ లేకుండా ఎమెస్కో ప్రచురించిన ఆ పుస్తకానికి శీర్షికగా ఉంచిన కథ పేరు 'ఆనాటి వానచినుకులు.' ఈ కథలో ప్రధాన పాత్ర పతంజలి అహంభావిగా కనిపిస్తాడు. తాను నమ్మింది మాత్రమే జీవితమనీ, అందంగా జీవించాలంటే అందమైన పరిసరాల్లో, చక్కని సంగీతం వింటూ, ఇంచక్కని  కవిత్వం చదువుకోడమే మార్గమనీ, అలాంటి వాళ్లకి మాత్రమే భావుకత్వం అలవడుతుందనీ  బలంగా నమ్ముతాడు.

మద్రాసు మహానగరంలో నివాసముండే పతంజలి అనుకోకుండా ఓ మారుమూల పల్లెటూరికి అవస్థలతో కూడిన ప్రయాణం చేయాల్సి రావడం, ఆ యాత్రలో అతడి చివరి ప్రయాణ సాధనమైన రిక్షాని చూడగానే అతడు భావుకత్వాన్ని గురించి అన్నాళ్ళుగా నమ్ముతూ వచ్చిన విషయాలన్నీ తప్పేనన్న ఎరుక ఒక్కసారిగా కలగడంతో కథ ముగుస్తుంది. ఆ మారుమూల కుగ్రామంలో రిక్షా నడుపుకునే గోపాలం అత్యంత సామాన్యుడు. తన ఒంటినీ, రిక్షాన్నీ పరిశుభ్రంగా ఉంచుకున్న వాడు. అంతే కాదు, రిక్షా వెనుక తన స్వహస్తాలతో 'ఆనాటి వానచినుకులు' అని రాసుకున్న వాడూను.

చదువుకీ, సంస్కారానికే కాదు, చదువుకీ భావుకత్వానికీ కూడా పెద్దగా సంబంధం లేదని నిరూపించే ఈ కథలో ముగింపు ఒక మాస్టర్ స్ట్రోక్. 'ఆనాటి వానచినుకులు' అనే వాక్యం ఎందుకు రాసుకుని ఉంటాడో అనే ఊహని పాఠకులకే వదిలేయడం వల్ల ఈ కథకి సంపూర్ణత్వం వచ్చిందనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక, ఇవాళ్టి ఆదివారం ఆంధ్రజ్యోతి కథపేరు 'ఆనాటి చెలిమి ఒక కల.' అమెరికాలో మొదలయ్యి, అమెరికాలో ముగిసే ఈ కథలో ప్రధానమైన భాగం అంతా అమలాపురం, ఆ చుట్టుపక్కల పల్లెటూళ్లలో జరుగుతుంది, అదికూడా ఓ నాలుగు దశాబ్దాల క్రితం.

కథకుడి స్నేహితుడి బంధువు రాజు రిక్షా నడుపుకుంటూ ఉంటాడు. కవిత్వం అంటే ఇష్టం కూడా. నెమ్మదిగా కథకుడికి తన స్నేహితుడి కన్నా, రాజు దగ్గరవాడు అయిపోతాడు. సర్వవేళలా ఇస్త్రీ బట్టలు ధరించే రిక్షా రాజు, తన రిక్షాని అరిగిపోయేలా తుడుస్తూ ఉండడమే కాదు, రిక్షా వెనుక ప్రతినెలా ఓ వాక్యం రాయిస్తూ ఉంటాడు ఓ పెయింటర్ చేత. సాధారణంగా సినిమా పాటల పల్లవులు, అప్పుడప్పుడూ కవితా పంక్తులు అతని రిక్షా వెనుక దర్శనమిస్తూ ఉంటాయి. వచ్చే నెల ఏ వాక్యం అనే విషయం మీద కథకుడు, అతని స్నేహితుడూ పందేలు వేసుకుంటూ ఉంటారు కూడా.

రిక్షా రాజు రాయించిన ఒకానొక వాక్యం 'ఆనాటి వానచినుకులు.' ఈ వాక్యం ఎందుకు రాయించాడో కథకుడికి తెలియక మునుపే, కథకుడు మొదట చదువు కోసం, ఆ తర్వాత ఉద్యోగం కోసం ఊరికి దూరంగా వెళ్లి, ఆ తర్వాత శాశ్వతంగా ఊరితో సంబంధాలు కోల్పోవడం జరుగుతుంది. కథకుడి కొడుకు 'ఆడి' కారు వెనుక అతికించిన బంపర్ స్టికర్ లో ఉన్న వాక్యం చూడగానే రాజు గుర్తొచ్చి ప్రత్యేకంగా ఇండియా ప్రయాణంలో రాజుని కలిసి 'ఆనాటి వానచినుకులు' వెనుక కథని తెలుసుకోవడంతో బోల్డంత నాటకీయతతో ముగుస్తుందీ కథ.

వంశీ రాసిన 'ఆనాటి వానచినుకులు' కథ లేకపోతే, ఈ కథ లేదన్న విషయం రెండు కథలూ చదివిన వాళ్లకి సులభంగా అర్ధమయ్యే విషయం. ఎటొచ్చీ వంశీ కథలో పాత్రలు నేలమీద నడిస్తే, తాజా కథలో పాత్రలు నేల విడిచి కనిపిస్తాయి. గోపాలాన్ని రిక్షా నడుపుకునే వ్యక్తిగా అంగీకరించగలం కానీ, రాజు వేషభాషలకీ అతని వృత్తికీ ఏమాత్రం పొసగదు. గోపాలం తనకి ఇష్టమైన వాక్యాన్ని తన వంకర టింకర అక్షరాలతోనే రిక్షా వెనుక రాసుకున్నాడు. రాజు మాత్రం, నెలకో వాక్యం - అది కూడా 'ఆనాటి వానచినుకులు' మినహా మిగిలినవన్నీ కవులవీ, సినీ కవులవీ - డబ్బిచ్చి రాయిస్తూ ఉంటాడు. రెండు కథల మధ్యా పోలిక కేవలం యాదృచ్చికం అని సరిపెట్టుకుందాం అని చాలా ప్రయత్నించాను కానీ, నావల్ల కాలేదు.

ఆదివారం ఆంధ్రజ్యోతి వాళ్ళు పాఠకుల నమ్మకాన్ని నిలబెట్టుకునే విషయంలో మరింత శ్రద్ధ  తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

గురువారం, నవంబర్ 24, 2016

పెళ్లి - ప్రదర్శన

వయసొచ్చిన పిల్లలకి తగిన  సంబంధం చూసి పెళ్లి చేయడం అన్నది చాలామంది తల్లిదండ్రులకి బాధ్యత. అతి కొద్దిమంది తల్లిదండ్రులకి మాత్రం పరపతిని ప్రదర్శించుకునేందుకు దొరికే అవకాశం. పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్లకి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాలు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. వాళ్ళు చేసే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. రాజకీయనాయకులు ఎన్నికల సమయంలో భారీగా సొమ్ము వెదజల్లితే, మిగిలిన రెండు వర్గాలూ పెళ్లిళ్లు, వేడుకలకి బాగా ఖర్చు చేస్తూ ఉంటాయి.

నిన్నమొన్నటి వరకూ పెళ్లిళ్ల ఖర్చు విషయంలో రాజకీయ నాయకులు వెనకడుగు వేసేవాళ్ళు.. మరీ బయటపడిపోవడం ఎందుకని కావొచ్చు. ఎప్పుడైతే పబ్లిగ్గా డబ్బిఛ్చి ప్రజల నుంచి ఓట్లు కొనుక్కోడాలు, అలా గెలిచిన నాయకులని రాజకీయ పార్టీలు పెద్దమొత్తాలు చెల్లించి టోకున కొనుగోలు చేయడాలు - కొండొకచో కేసుల బారిన పడడాలు - లాంటివి నిత్యజీవితంలో భాగం అయిపోయాయో, హోదాని, దర్జాని చూపించుకుని విషయంలో రాజకీయ నాయకులు సైతం వెనకడుగు వేయడంలేదు. అలాంటి నాయకుల ఇళ్లలో జరుగుతున్న పెళ్లిళ్లు ఇప్పుడు హాట్ టాపిక్. జాతీయ స్థాయిని దాటేసి, అంతర్జాతీయ వార్తలుగా మారిపోయాయి ఆ వేడుకలు.

కాంగ్రెస్, బీజీపీ నాయకుల ఆశీస్సులతో, అండదండలతో వ్యాపారిగా ఎదిగి, రాజకీయనాయకుడిగా మారి కన్నడ రాజకీయాలని శాసించే స్థాయికి చేరుకున్న తెలుగువ్యక్తి గాలి జనార్దన రెడ్డి తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని బెంగళూరులో జరిపించారు గతవారం. పోలీసు కానిస్టేబుల్ కొడుకుగా జీవితాన్ని మొదలుపెట్టి, బళ్ళారి ప్రాంతంలోని ఇనుప గనులపై గుత్తాధిపత్యం సాధించడం ద్వారా తక్కువ కాలంలో వేలకోట్లు కూడబెట్టి, అక్రమాలు బయటపడడంతో జైలుకి వెళ్లి, బెయిలుపై బయటికి వఛ్చిన జనార్దన రెడ్డి కూతురి పెళ్లి నిమిత్తం ఖర్చు చేసిన మొత్తం ఐదొందల కోట్ల పైచిలుకు అంటున్నాయి ప్రసార సాధనాలు.

కేసుల కారణంగా తాను బెంగుళూరు విడిచి వెళ్ళకూడదు కాబట్టి, తన స్వస్థలం బళ్లారిని బెంగుళూరు పేలస్ గ్రౌండ్స్ లో సృష్టించుకున్నారు జనార్దన రెడ్డి. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని గుర్తుచేసేలా వేయించిన భారీ సెట్లలో, రాచరికపు పద్ధతుల్లో జరిగిన వివాహం తాలూకు వీడియోలిప్పుడు యూట్యూబు లో అత్యధిక వ్యూయర్షిప్ దిశగా దూసుకుపోతున్నాయి.ఈ 'మైనింగ్ కింగ్' ని దక్షిణ భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో పరపతిని ప్రదర్శించిన రెండో రాజకీయనాయకుడని చెప్పాలి. కొన్నేళ్ల క్రితమే పెంపుడు కొడుకు సుధాకరన్ పెళ్లిని ఇంత వైభవంగానూ జరిపి వార్తల్లో నిలిచారు - సినిమాల నుంచి రాజకీయాలకి వఛ్చిన - తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత.

ఇక, గడిచిన వారం రోజుల్లో తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఖరీదైన వివాహాలు జరిగాయి, రెండూ కూడా అధికారానికి దగ్గరగా ఉన్న నేతల కుటుంబాల్లోనే. రెండు చోట్లా పదుల కోట్లలో సొమ్ము ఖర్చు చేశారని వినికిడి. ఓ పక్క పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యులు బ్యాంకులలో దాచుకున్న కష్టార్జితాన్ని డ్రా చేసుకోడానికి ఇబ్బందులు పడుతుండగా, రాజకీయ నాయకులు డబ్బును నీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడాన్ని 'పారడాక్సికల్' అన్న మాటతో సరిపుచ్చేయాలా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఎదురు చూడాలా? లేక, చట్టాల్లో లొసుగులు పూడ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశించవచ్చా?

'భారతదేశంలో సంపద పెరుగుతోంది..దానితో పాటే ధనిక, పేద మధ్య అంతరాలూ పెరుగుతున్నాయి' అన్నది ఆర్ధిక వేత్తలు గత రెండు దశాబ్దాలుగా విశ్లేషించి చెబుతున్న విషయం. మొత్తం దేశ సంపదలో యాభై శాతానికి పైబడి కేవలం పది శాతం జనాభా దగ్గర పోగుపడి ఉందంటున్నారు ఎకనామిస్టులు. పెళ్లిళ్ల పేరిట జరుపుతున్న సంపద ప్రదర్శనలు సామాజిక అంతరాలని పెంచి పోషిస్తాయనడంలో సందేహం లేదు. 'ఏం చేసైనా డబ్బు సంపాదించడం ముఖ్యం.. డబ్బుంటే చట్టం ఏమీ చేయలేదు' అన్న సంకేతాలని సమాజంలోకి పంపే ప్రమాదమూ ఉంది. కొందరి వినోదం, సామాజిక విషాదానికి దారితీయకూడదు కదా...

సోమవారం, నవంబర్ 21, 2016

మాబడి

అల్లప్పుడెప్పుడో పందొమ్మిదివందలో సంవత్సరంలో బళ్ళో చదువుకున్న ఒకాయన, ఆతర్వాత యాభై ఏళ్ళకి బాగా పెద్దయిపోయాక ఆ జ్ఞాపకాలన్నీ పుస్తకంగా రాసుకుని ప్రచురించుకున్నారు.. నాటి (నేటికీ) సాహితీ పెద్దమనుషులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు ముందుమాట రాసి ఆశీర్వదించిన ఆ పుస్తకం లైబ్రరీల్లో చెదపురుగుల బారిన పడిపోయేదే, మోదుగుల రవికృష్ణ అనే సాహిత్యాభిమాని కంట పడకుండా ఉండి ఉంటే. తెలుగు సాహిత్యం, అందునా ఆధునిక యుగం తొలినాటి రచనలంటే ప్రత్యేకాభిమానం ఉన్న రవికృష్ణ ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా రక్షించడమే కాకుండా తన మిత్రుల సాయంతో మళ్ళీ ప్రచురించి మార్కెట్లో విడుదల చేశారు. ఆ పుస్తకంతో తన అనుభవాలు మరియు శ్రీరమణ రాసిన తాజా తాజా ముందుమాటలో సహా.. ఆ పుస్తకం పేరే 'మాబడి.'

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ వాసి తెన్నేటి కోదండరామయ్య రాసిన నాటి 'మాబడి' ని నేడు చదవాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకి జవాబు వెతుక్కుంటే చాలు, ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటో అర్ధమవ్వడానికి. తరాలు మారిపోయినా, సాంకేతిక పరిజ్ఞానం బోల్డంత అభివృద్ధి చెందిపోయినా నాటికీ నేటికీ మారనివాటిలో మొదట చెప్పుకోవాల్సింది చిన్న పిల్లలు బడికి వెళ్లడం. ఇప్పటివాళ్ల సంగతెలా ఉన్నా, అప్పటివాళ్ళు ఎలిమెంటరీ స్కూలు చదువు ఆడుతూ పాడుతూ ముగించి, హైస్కూలు చదువుతుతో పాటు లోకజ్ఞానాన్నీ గ్రహించే వాళ్ళన్న విషయంతో పాటు, సదరు జ్ఞాన సముపార్జన కోసం జరిగిన ఏర్పాట్లు తెలుసుకోవచ్చు.

ఇప్పటి విద్యాలయాల్లో జరిగేవి ఒకరకం రాజకీయాలైతే, నాటి బళ్ళలో జరిగినవి మరో రకం రాజకీయాలనీ, రాజకీయం తగుమాత్రంగా రూపం మార్చుకుంది తప్ప స్కూళ్ళని పట్టి పీడించడం మానలేదనీ అర్ధమవుతుంది. పిల్లలకి కొందరు మేష్టర్ల మీద విశేషించి అభిమానం ఉండడం, మరికొందరంటే అస్సలు పడక పోవడం, అదేవిధంగా ఒక మేష్టారికి అనుకూల, ప్రతికూల వర్గాలు, వాటి మధ్య గొడవలు ఆనాడూ ఉన్నాయని బోధ పడుతుంది. నేటి చదువులతో పాటు, ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా టీచర్ల నిర్ణయం మేరకే జరుగుతూ ఉండగా, నాడు సదరు యాక్టివిటీస్ బాధ్యత పూర్తిగా పిల్లలదే అని, అవసరమైతే మేష్టర్లు సాయం చేసేవాళ్ళే తప్ప పెత్తనం ఏమాత్రం చేసేవారు కాదన్న సత్యం ద్యోతకమవుతుంది.


పిల్లల చదువుల విషయంలో కొందరు తల్లిదండ్రుల భయంకర పట్టుదల ఇప్పటి తరానికి మాత్రమే ప్రత్యేకం కాదనీ, వందేళ్ల నాటి పరిస్థితి కూడా అంతేననీ తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటివి ఇంకా అనేకం కనిపించి అనేకానేక భావాలు కలిగిస్తాయి పాఠకుల్లో. తణుకు బోర్డు స్కూల్లో చదువుకున్న కోదండరామయ్య గారికి బడన్నా, హెడ్మాస్టారన్నా విపరీతమైన భక్తీ, గౌరవమూను. రెండు భాగాలుగా విభజించిన ఈ పుస్తకంలో మొదటిభాగం హెడ్మాస్టారి గొప్పదనాన్ని వైనవైనాలుగా వర్ణించారు. నాటి యూనియన్ బోర్డు ప్రెసిడెంటుకి హెడ్మాస్టారి మీద కినుక కలగడం, ఆయన్ని బదిలీ చేయించడం కోసం ప్రయత్నించి ఓడిపోవడంతో తొలిభాగం ముగుస్తుంది. హెడ్మాస్టారి కోసం ఊరు మొత్తం రెండుగా విడిపోవడం, అందరూ పనులు మానుకుని ఆయనకి సాయం చేయడమో, వ్యతిరేకంగా నిలబడ్డమో తప్ప తటస్థులెవరూ లేకపోవడం లాంటివి అతిశయోక్తుల్లా ధ్వనిస్తాయి.

ఇక పుస్తకంలో రెండో భాగం, స్కూలు విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న నాటక సమాజాన్ని గురించి. మొదటిభాగం కొంచం గంభీరంగా సాగితే, ద్వితీయ భాగం ఆసాంతమూ నవ్వులు పూయిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నవ్వకుండా పేజీ తిప్పడం అసాధ్యం. మొదటి భాగంలో 'బాలుని సముద్ర వర్ణన,' కోర్టు కేసులో సాక్ష్యాలు లాంటి సంఘటనలు నవ్వించినా అందులో నిజమెంత, అతిశయోక్తి పాలెంత అన్న సందేహం పీడిస్తూ ఉంటుంది. రెండో భాగంలో అలాంటి శషభిషలని తావులేదు. నవ్వగలిగినంత నవ్వుకోవచ్చు. నారదుడు, అర్జునుడు, శివుడు, సుభద్ర పాత్రలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వుకోకుండా ఉండడం అసాధ్యం. హెడ్మాస్టారితో సమంగా రచయితకి ఆరాధనీయుడు 'కృష్ణుడు' అనే సహవిద్యార్థి. ఇతణ్ణి మాత్రం రెండు భాగాల్లోనూ ఎత్తుపీట మీదే కూర్చోబెట్టారు.

లా చదువుకున్న కోదండరామయ్య గొప్ప చదువరి అన్న విషయం తొలి పుటల్లోనే తెలిసిపోతుంది. పందొమ్మిదో శతాబ్దపు ఆంగ్ల సాహిత్యం మీదా, రామాయణ, భారత, భాగవతాదుల మీద, తన సమకాలీన సాహిత్యం మీదా సమానమైన పట్టు ఉంది. స్నేహితుడు కృష్ణుడి గురించి చెబుతూ "ఒక్కమాటలో చెప్పాలంటే అడివి బాపిరాజు గారి 'నారాయణరావు' కి పాకెట్ ఎడిషన్ మా కృష్ణుడు" అనడం వెనుక కొంటె తనం తెలియాలంటే బాపిరాజూ, నారాయణరావూ పాఠకులకి కనీస పరిచయం ఉంటే బాగుంటుంది కదా. ఇప్పటికే చెళ్ళపిళ్ళ వారి 'కాశీయాత్ర' లాంటి పుస్తకాలు పునర్ముద్రించి తన అభిరుచి చాటుకున్న రవికృష్ణ, ఈ పుస్తకాన్ని తేవడం ద్వారా విద్యారంగానికి సేవచేశారని చెప్పాలి. సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు అందరూ చదవాల్సిన 'మాబడి' ని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లు తప్పక చదవాలి. (మిత్రమండలి ప్రచురణలు, పేజీలు 280, వెల రూ. 220, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు).

ఆదివారం, నవంబర్ 13, 2016

నా కరెన్సీ నోట్ల మార్పిడి ...

"ఆదివారం ఉదయాన్నే ఈ క్యూలో నిలబడ్డం ఏమిటో?" నన్ను నేను ప్రశ్నించుకుంటూ మా ఏరియా పోస్టాఫీసు క్యూలో చోటు సాధించాను. పోస్టాఫీసుతో సంబంధబాంధవ్యాలు బాగా తగ్గిపోవడంతో, అక్కడైతే పెద్దగా జనం ఉండరనుకున్నాను కానీ నా అంచనా తప్పింది. ఆదివారం పూటా ఉద్యోగం చేయాల్సి వచ్చిందనో, ఓవర్ టైం భత్యం అనౌన్స్ చేయకుండా డ్యూటీ చేయించేస్తున్నారనో లేక వారి సహజాతమో తెలీదు కానీ స్టాఫందరూ ఒకానొక ప్రముఖ తెలుగు హీరోని గుర్తు చేసేవిధంగా మొహాలు విసుగ్గా పెట్టుకుని కూర్చున్నారు. ఏం చేస్తాం.. అవసరం మనది కదా..

ప్లాస్టిక్ కార్డులు సర్వత్రా రాజ్యమేలుతున్న రోజుల్లో ఇంకా కరెన్సీతో అవసరం ఏమిటన్న ప్రశ్న రావొచ్చు ఎవరికైనా. నిజమే.. నోట్లు అవసరం లేకుండా చాలా పనులు జరిగిపోతున్నాయి. కానైతే కూరల షాపతను, ఇస్త్రీ అబ్బాయి, క్షురకుడు, వీధి చివర కిరాణా అబ్బాయి క్రెడిట్/డెబిట్ కార్డులు అంగీకరించేది లేదని తెగేసి చెప్పాక కరెన్సీ ప్రాధాన్యత ప్రాక్టికల్ గా అర్ధమయ్యింది. మామూలుగా అయితే నాల్రోజుల్లో అంతా సర్దుకుంటుంది లెమ్మని ఊరుకోవచ్చు కానీ, పరిస్థితి చక్కబడడానికి కనీసం కొన్ని వారాలు పడుతుందని సాక్షాత్తూ అరుణ్ జైట్లీ చెప్పాక కూడా ఉపేక్షించడం మంచిది కాదు కదా.

పోస్టాఫీసు వాళ్ళు అందుబాటులో ఉంచిన ఫామ్ తీసుకుని అక్కడ సూచించిన కాలాలన్నీ పూర్తి చేశాను. ఇద్దరి తర్వాత నా టర్న్. ఒకింత సంతోషంగా ఫామ్ కౌంటర్ లో ఉన్న ఉద్యోగినికి ఇచ్చాను.. ఏ డినామినేషన్ నోట్లు ఎన్ని అడగాలో మనసులో రిహార్సల్ వేసుకుంటూ. "మీరు సరెండర్ చేయబోయే నోట్ల సీరియల్ నెంబర్లన్నీ వరసగా రాసి, సంతకం పెట్టి, మీ ఫోన్ నెంబర్ వేసి తీసుకురండి" అని ఆవిడ మృదువుగా చెప్పి ఫామ్ నా చేతికి ఇచ్చేయడంతో వెనకవాళ్ళు సంతోషించారు. ఆ పని పూర్తి చేసి క్యూలో చేరాను. కాస్త ఓపిక పట్టాక మళ్ళీ నా టర్న్ వచ్చింది. "నా దగ్గర రెండువేల నోట్లు మాత్రమే ఉన్నాయండీ.. మీకు వందలు కావాలంటే పక్క క్యూలో నిలబడండి," దూరదర్శన్ శాంతిస్వరూప్ ని జ్ఞాపకం చేస్తూ ప్రతి అక్షరం స్పష్టంగా పలికిందామె.

పక్కన ఉన్న రెండు క్యూల్లో ఒక చోట జనం తక్కువగా ఉండడంతో చేరిపోయాను.. నోట్లతో వచ్చే వాళ్ళ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నా టర్న్ మళ్ళీ వచ్చింది. ఇక్కడా ఉద్యోగినే. కానైతే ఈవిడ ఫామ్ చూస్తూనే ముఖం చిట్లించి "ఎక్స్చేంజ్ ఇక్కడ కాదు, పక్క కౌంటర్" అని దురుసుగా చెప్పాక కానీ, ముందావిడ మంచితనం అర్ధం కాలేదు. అత్యంత ఆసక్తికరంగా మూడో కౌంటర్లో కూడా స్త్రీమూర్తే! కాకపొతే ఈవిడ డైలీ సీరియల్స్ బాగా చూస్తారనుకుంటా.. ప్రతి పనీ అతి తాపీగా చేస్తున్నారు. నా ముందు వాళ్ళిచ్చిన ఫామ్ కి నోట్లు పిన్ చేయాలి.. స్టాప్లెర్ లో పిన్స్ అయిపోయాయి. ఆవిడ అటెండర్ లో పిలవగా పిలవగా అతగాడు వచ్చాడు. కాసేపటి తర్వాత పిన్నులు తెచ్చాడు. మళ్ళీ వచ్చి వాటిని స్టాప్లర్ లో వేశాడు.. అప్పటివరకూ ఆవిడ కంప్యూటర్ స్క్రీన్ ని శ్రద్ధగా పరికించారు.

ఒక్కో నోటుని పరిశీలిస్తూ, వేసిన నెంబర్లని నోట్ల మీద అంకెలనీ టాలీ చేసుకుంటూ నింపాదిగా ఉలికిపడ్డారు. "ఈ నోట్లన్నీ రాసిన ఆర్డర్లో పెట్టి తీసుకురండి" అని చెప్పి తిప్పి పంపేశారు. నాకు తెలియకుండానే ఊపిరి బిగిసింది. గుండె వేగం హెచ్చింది.. వందనోట్లు వచ్చేస్తాయి అన్న ఆత్రుత నిలబడనివ్వడం లేదు. ఆవిడ నా అప్లికేషన్ ఆసాంతమూ చదివి, ఒకట్రెండు చోట్ల నేను ఎలా రాసి ఉంటే బావుండేదో వివరించి చెప్పి, అప్లికేషన్తో పాటు జత చేసిన ఆధార్ కాపీ మీద నా సంతకం తీసుకున్నారు. హమ్మయ్య.. చివరి ఘట్టం.. ఓ రెండు గంటలు నావి కాకపోతేనేమి.. పనయిపోతోంది.. అనుకుంటున్నానో లేదో ఆవిడ సూటిగా ప్రశ్నించారు "ఆధార్ ఒరిజినల్ ఇవ్వండి?"

అయిపోయింది.. ఆశలన్నీ ఆవిరైపోయాయి.. "తేలేదండీ" తప్పుచేసిన భావన నా గొంతులో పలకలేదెందుకో. ఆధార్ ఒరిజినల్ వెరిఫికేషన్ ఉంటుందని నేనెక్కడా చదవలేదు. అసలు వాళ్లకి అంత టైం ఉంటుందని కూడా అనుకోలేదు. "ఉహు.. ఆధార్ ఒరిజినల్ లేకుండా నోట్లు ఇవ్వడం కుదరదు" ఫామ్ ని సున్నితంగా నా మొహాన కొట్టారు. పొడవాటి క్యూలు ఎందుకు ఉంటున్నాయో బాగా అర్ధమయింది. నా వెనుక ఎవరో డ్వాక్రా మహిళ.. ఎక్కడ తేడా వచ్చిందో గమనించలేదు కానీ.. "తెలుసుకోకుండా ఎందుకు వచ్చేస్తారమ్మా" అని తాపీగా కోప్పడింది కౌంటర్ ఆవిడ. నేను వెనక్కి చూడలేదు. "తెలిత్తే మాకీ తిప్పలెందుకమ్మా" రోషంగా అంది డ్వాక్రా మహిళ. ఆగి, వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాను, ఆ మహిళని కళ్ళతో అభినందించడం కోసం.. 

బుధవారం, నవంబర్ 09, 2016

అమెరికన్ ఎన్నికలూ, ఇండియన్ కరెన్సీ..

నిన్న అర్ధరాత్రి నుంచీ ఈ రెండూ ట్రెండింగ్ టాపిక్స్ అయిపోయాయి.. అటు అమెరికా అధ్యక్ష స్థానానికి జరుగుతున్న ఎన్నికలు.. ఇటు భారతదేశంలో ఉన్నట్టుండి అమలులోకి వచ్చిన కరెన్సీ రద్దు. అప్పటివరకూ అమెరికా ఎన్నికలమీద మాత్రమే దృష్టి పెట్టిన భారతీయలు, ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లని రద్దు చేస్తూ నిన్నరాత్రి ప్రధాని ప్రకటన చేయగానే, ఎన్నికలని తాత్కాలికంగా మర్చిపోయి, ఇవాళ మధ్యాహ్నం తుది ఫలితం వెల్లడయ్యాక మళ్ళీ అమెరికా గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

డెమొక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థులుగా ప్రకటన వఛ్చిన కొద్దిరోజులకే నాకు ట్రంప్ గెలుస్తాడనిపించింది. దగ్గర మిత్రులు కొందరి దగ్గర అన్నాను కూడా. అమెరికాని బాగా ఫాలో అయ్యేవాళ్ళు కొట్టిపారేశారు. అత్యధిక మెజారిటీతో హిల్లరీ గెలుస్తుందన్నది వాళ్ళ జోస్యం. తక్కువ మెజారిటీతో ట్రంప్ అధ్యక్షుడు అవుతాడన్నది నా నమ్మకం. ఈ నమ్మకం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది, ఒక మహిళని అధ్యక్షురాలిగా ఒప్పుకునేంతగా అమెరికన్లు ఎదిగారా? అన్నది.

రోజులు గడిచే కొద్దీ, ఇద్దరి హామీలు, ప్రచారాలు, ప్రసంగాలు, వాదోపవాదనలు ఇవన్నీ క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నప్పుడు కూడా నా అభిప్రాయం మారలేదు. 'అమెరికాకి ఏం చెయ్యాలి?' అన్న విషయంలో హిల్లరీ కన్నా ట్రంప్ కి ఎక్కువ స్పష్టత ఉందనిపించింది చాలాసార్లు. నేను చదివిన పత్రికలు, చూసిన టీవీ కార్యక్రమాలలో సింహభాగం హిల్లరీకే మద్దతు ఇచ్చాయి. ఓ నెలక్రితం మిత్రులొకరు "ప్రపంచం బాగుపడాలంటే హిల్లరీ గెలవాలి.. అమెరికా బాగుపడాలంటే ట్రంప్ గెలవాలి" అన్నారు. అమెరికన్ ఓటర్లు అమెరికా గురించి ఆలోచిస్తారు కానీ, ప్రపంచం గురించి కాదు కదా అనుకున్నాను నేను.

కొందరు మిత్రులు పట్టు విడవకుండా, "ట్రంప్ గెలిస్తే ఇండియా కి నష్టం తెలుసా?" అంటూ నాలో దేశభక్తిని రగిల్చే ప్రయత్నం చేశారు. నేను మరీ గట్టిగా మాట్లాడితే అలమండ భూవి తగువులా మారే ప్రమాదం కనిపించి, అభిప్రాయలు దాచుకోడం మొదలుపెట్టాను. ఇప్పుడింక ట్రంప్  గెలిచాడు కాబట్టి, క్షణ క్షణముల్ ట్రంప్ చిత్తముల్ కాబట్టి.. ఏరోజు ఏం జరుగుతుందో చూడాలి తప్ప పెద్దగా ఊహించేందుకు ఏమీ ఉండకపోవచ్చు. అయినా ట్రంప్ ఒఖ్ఖణ్ణీ అనుకోడం ఎందుకూ, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ రాత్రికి రాత్రే కరెన్సీ ప్రకటన చేయలేదూ? 'కొంచం ముందస్తుగా తెలిసినా బాగుండేది' అనుకుంటున్న వాళ్ళు చాలామంది నా చుట్టూనే ఉన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు నెలక్రితమే నోట్ల రద్దు గురించి ప్రధానికి లేఖ రాశారు. పై సర్కిళ్లకి ముందస్తుగా ఉప్పేమన్నా అంది ఉంటుందా అన్న సందేహం కలుగుతోంది ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఐదు వందల రూపాయల నోటు కొత్తది వచ్చేస్తోంది కానీ, వెయ్యి స్థానం లో మాత్రం రెండువేల రూపాయల నోటు వస్తుందని చెబుతున్నారు. "ఈ మొత్తం వ్యవహారంలో సామాన్యుడికి ఒరిగేది ఏమన్నా ఉంటుందో ఉండదో కానీ, ఓ వారం పది రోజుల పాటు కరెన్సీ కష్టాలు మాత్రం ఖాయం" అంటున్నారు మిత్రులు.

నాకైతే మార్కెట్లో మనీ ఫ్లో పెరుగుతుందనిపిస్తోంది. కొన్నాళ్లపాటు రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యి, షేర్ మార్కెట్ పెరగొచ్చు. యాభై రోజుల గడువుంది కాబట్టి, డబ్బు నిల్వలు ఉన్నవాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు కాబట్టి, దేశీయంగా ఉన్న నల్లడబ్బు మొత్తం మార్కెట్లోకి వచ్చేస్తుందని అనుకోలేం.. కనీసం కొంతైనా రాకుండా ఉండడం అన్నది మాత్రం అసాధ్యం. డబ్బు కన్నా కూడా ముఖ్యమైన విషయం ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం కలగడం. ఒక్కో వ్యవస్థ మీదా జనానికి నమ్మకం పోతున్న తరుణంలో ప్రభుత్వం గట్టిగా తల్చుకుంటే, డబ్బున్న వాళ్ళని ఇలా కూడా ఇబ్బంది పెట్టగలదు అన్న సందేశం అయితే ప్రజల్లోకి వెళ్తుంది, కచ్చితంగా..

(మరి పేదవాడి ఇబ్బందులో అనొచ్చు, కొంత ఇబ్బంది ఉన్నా కష్టార్జితం రూపాయికి వంద పైసలూ తిరిగి వచ్చేస్తుంది, రాచమార్గంలో.. నల్లడబ్బు నిల్వలున్న వాళ్ళు ఇంత తక్కువ సమయంలో కరెన్సీని మార్చుకోవాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టక తప్పదు.. ఆ మొత్తం తెలుపే అవుతుంది కదా..)

మంగళవారం, నవంబర్ 01, 2016

పింజారి

ఎమెస్కో ఆ మధ్యన ప్రచురించిన 'తెలుగువారి ప్రయాణాలు' పుస్తకం చదువుతూ రాసుకున్న 'చదవాల్సిన పుస్తకాల' జాబితాలో ఒకటి బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఆత్మకథ. ఎం. ఆదినారాయణ సంకలనం చేసిన 'తెలుగువారి ప్రయాణాలు' లో అనేక రంగాలకి చెందిన తెలుగు వారి ప్రయాణ విశేషాలను వారే రాసిన పుస్తకాల్లో నుంచి సేకరించి ప్రచురించారు. ప్రజానాట్యమండలి కళాకారుడైన నాజర్ అటు పోలీసులు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలనీ తప్పించుకుంటూ గుంటూరు జిల్లాలో రహస్య జీవితం గడిపిన రోజుల్లో చేసిన ప్రయాణాలని చదివానా పుస్తకంలో. మొన్ననే నాజర్ ఆత్మకథ 'పింజారి' దొరికింది.

ఇప్పుడు వినడానికి 'పింజారి' అనేది నిందావాచకంలా అనిపిస్తుంది. కానీ, దూదేకుల కుటుంబంలో పుట్టి పెరిగిన నాజర్ 'నేను పింజారిని' అని చాలా సందర్భాల్లోనే చెప్పుకున్నారు. తెలుగునాట బుర్రకథకి కొత్త ఒరవడిని పెట్టి, పేరు ప్రతిష్ఠలతో పాటు ప్రభుత్వం నుంచి పద్మ పురస్కారాన్నీ అందుకున్న నాజర్ జీవితానికి సంబంధించిన విహంగ వీక్షణం ఈ పుస్తకం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి బుర్రకథలపై పీహెచ్డీ చేసిన అంగడాల వెంకటరమణ మూర్తి, తన పరిశోధనలో భాగంగా అనేక పర్యాయాలు నాజర్ ని కలిసినప్పుడు, ఆ కళాకారుడు తన గురించి పంచుకున్న విశేషాలని అక్షరబద్ధం చేసి 'పింజారి' పేరుతో ప్రచురించారు.

గుంటూరు జిల్లా పొన్నెకల్లులో నాజర్ పుట్టిపెరిగిన దూదేకుల వీధిలో పందిరి గుంజ కూడా పాటలు పాడుతుందిట. సంగీతంతో అంతగా మమేకమైన కుటుంబాలవి. నాజర్ కుటుంబం స్థానిక దేవాలయంలో అనువంశిక నాదస్వర కళాకారులు. అయితే, నాజర్ కి మాత్రం పుట్టుకతోనే విద్య పట్టుపడిపోలేదు. మొదట నాటకాల్లో బాల నటుడిగా నటించిన నాజర్ కి పాట బాగా పట్టుపడుతుందని గుర్తించిన వాడు హార్మోనిస్టు ఖాదర్. ఓ పక్క పేదరికం, మరోపక్క పిల్లవాడికి సంగీతం చెప్పించాలన్న ఆ కుటుంబ సభ్యుల తాపత్రయం.. తపన కొన్నాళ్ళు, పేదరికం కొన్నాళ్ళు గెలవడంతో కొంతమేరకు మాత్రమే సంగీతం నేర్చుకోగలిగారు నాజర్.


కుటుంబ పోషణ కోసం నటన, బుర్రకథలు, ఏమీ లేనప్పుడు టైలరింగ్ పనులతో ఎప్పుడూ క్షణం ఖాళీ లేకుండా గడుపుతున్న నాజర్ జీవితంలో పెద్ద మలుపు కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడు కావడం. ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురుపడ్డా అతడు పార్టీని విడవకపోయినా, పార్టీనే రాజకీయ కారణాలతో కొన్నాళ్ల పాటు నాజర్ ని దూరం పెట్టింది! విద్య నేర్చుకున్న విధానం మొదలు సాటి కళాకారుల సహకారం, అప్పుడప్పుడూ వాళ్ళ కారణంగా ఎదుర్కొన్న సమస్యలు, పార్టీ రాజకీయాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రావడం, వెంట్రుక వాసిలో చావు నుంచి తప్పించుకోవడం.. ఇవన్నీ ఈ పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తాయి. సినీ రంగ ప్రవేశం, కొన్ని అనుభవాల తర్వాత వెండితెర కన్నా స్టేజీ మీద బుర్రకథ చెప్పడానికే మొగ్గు చూపడం ఆసక్తికరమైన సంగతులు.

కళాకారుడిగా ఎత్తులకు ఎదుగుతున్న సమయంలో కుటుంబంలో వచ్చిన సమస్యలు.. వాటిని నాజర్ ఎదుర్కొన్న వైనాన్ని క్లుప్తంగా వివరించారు రచయిత. తెలుగు ప్రజలు గర్వించ దగ్గ కళాకారుడిగా ఎదిగిన నాజర్ కు అస్సలు లేనిది డబ్బు జాగ్రత్త. సొంత ఇల్లు కట్టుకోవడం, పిల్లలకి విద్య నేర్పించడం మినహా ఆస్థుల రూపంలో దాచింది ఏమీ లేదన్న సంగతి పెద్దగా ఆశ్చర్య పరచదు. కమ్యూనిస్టు పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేసిన వాళ్ళెవరూ ఆస్థులు కూడబెట్టుకున్న దాఖలాలు లేవు మరి. నాజర్ బహుముఖీన వ్యక్తిత్వాన్ని పాఠకులకి పరిచయం చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారు. పుస్తకం మొత్తం ఒక ఎత్తైతే, చివర్లో 'మా బాజీ' అంటూ నాజర్ భార్య ఆదంబీ రాసిన వ్యాసం ఒక్కటీ మరో ఎత్తు.

ఆదంబీ నాజర్ కి మూడో భార్య. మేనమామ కూతురు కాశింబీని పెళ్లిచేసుకున్న నాజర్, ఆమెకి  అనారోగ్యం చేయడంతో మరో పెళ్లి చేసుకుని, ఆమె అకాల మరణం పాలవ్వడంతో కాశింబీ చెల్లెలు ఆదంబీని పెళ్లిచేసుకున్నారు. చివరి వరకూ కాశింబీ నాజర్, ఆదంబీలతో కలిసే ఉన్నారు. "నా తొమ్మిదో ఏట ఒకసారి మా ఇంటికి అడుక్కునే సాధువు వొచ్చాడు. నా చెయ్యి చూసి, నీకు పండితుడు దొరుకుతాడు అని చెప్పాడు. అది విని మా అక్కలు దూదేకుల సాయిబుల్లో పండితుడెవడే అని నవ్వేవాళ్ళు" అంటూనే, ఒక్కో బుర్రకథ తయారు చేయడానికీ నాజర్ పడ్డ శ్రమనీ, సేకరించిన వివరాలనీ జ్ఞాపకం చేసుకుని, సాధువు మాట పొల్లుపోలేదంటారు ఆదంబీ.

పుస్తకం చదవడం పూర్తి చేసేశాక, 'యుగధర్మం' శీర్షికతో 'అరుణ' రాసిన నాలుగు మాటల్లో ఆకర్షించిన వాక్యాలివి: "పెద్దనగారు గండపెండేరం తొడిగించుకున్న కాలానికి పింజారీ ఊరవతల ఉన్నాడు. పింజారీ గండపెండేరం తొడిగించుకునే కాలానికి పెద్దనగారు పెద్దమనిషి అయి ఇవన్నీ తప్పురా అంటే - కాలం చిన్నబుచ్చుకోదా.." ఎనభై ఆరు పేజీల 'పింజారి' సారాంశాన్ని అరుణ ఒకే ఒక్క వాక్యంతో చెప్పేశారనిపించింది. మరుగున పడిపోతున్న కళల మీద, కళాకారుల మీదా ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకమిది. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 65. అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది.