శుక్రవారం, ఫిబ్రవరి 01, 2013

చిన్నపరిశ్రమలు-పెద్దకథలు

డాక్టర్ సోమరాజు సుశీల పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేవి 'ఇల్లేరమ్మ కతలు'. బాల్య జ్ఞాపకాలని యెంత అందంగా దాచుకోవచ్చో చెప్పే సంకలనం ఇది. అటు తర్వాత తను అడపా దడపా రాసిన కథలో సుశీల వెలువరించిన సంకలనం 'దీపశిఖ' సైతం పాఠకులని మెప్పించింది. అయితే, ఈవిడ రచనా వ్యాసంగం మొదలయ్యింది కథలు కాని కథలతో. ఆ కథలతో వచ్చిన సంకలనమే 'చిన్నపరిశ్రమలు-పెద్దకథలు.' ఈ కథల తర్వాతే 'ఇల్లేరమ్మ కతలు' రాసి, తెలుగు సాహిత్యంలో ఇల్లేరమ్మగా స్థిర పడిపోయారు సుశీల.

వృత్తిరీత్యా ఓ చిన్న తరహా పరిశ్రమకి యజమాని అయిన శ్రీమతి సుశీల, పరిశ్రమ నడపడంలో కష్టసుఖాల్ని- పేరుకే కష్టసుఖాలు కానీ కథల్లో కనిపించేవి అన్నీ కష్టాలే అనుకోండి - వివరిస్తూ రాసిన పన్నెండు కథల సంకలనం ఇది. పెద్దకథలు అన్నది నిడివికి సంబంధించిన విషయం కాదనీ పరిశ్రమల వెనుక ఉన్న శ్రమని సూచిస్తూ ఆ పేరు వాడారనీ 120 పేజీల ఈ చిరు పుస్తకం సైజు చూడగానే సులువుగా అర్ధమవుతుంది. ఆపకుండా చదివించే శైలి కారణంగా, పేజీలు అలవోకగా తిరిగిపోతాయి.

సంకలనంలో తొలి కథ 'మహా శ్రమ,' పుస్తకం ఎలా ఉండబోతోందో చెప్పేస్తుంది. అమెరికాలో ఉండే ఓ కుర్రాడు, రచయిత్రికి బాగా తెలిసిన వాడు, అక్కడి ఉద్యోగం వదులుకుని ఇండియా వచ్చి ఏదన్నా చిన్న పరిశ్రమ పెట్టాలి అని నిర్ణయించుకుని రచయిత్రిని సలహా అడుగుతాడు. పరిశ్రమలకి ప్రోత్సాహం అంటూ ప్రభుత్వం చేసే ప్రచారానికీ, వాస్తవ పరిస్థితులకీ మధ్య ఉన్న భేదాన్ని చిత్రించారు ఈ కథలో. ఇల్లేరమ్మ మార్కు చెణుకులకి ఏమాత్రం లోటు ఉండని కథ. ఆ మాటకొస్తే, ఈ చెణుకులు ప్రతి కథనీ మెరిపించాయి.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిశ్రమకి 'ఆకస్మిక తనిఖీ' కి వచ్చేసరికి, తన చాంబర్లో 'ఋతురాగాలు' సీరియల్ చూస్తూ, ఎవరినీ నిద్రపోనివ్వని సీఎం గారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు రచయిత్రి. తర్వాత ఏం జరిగింది అన్నది 'అయినవాళ్ళం మహాప్రభో' కథ. "ఐదారుగురు వచ్చారమ్మా. ఎవరో చంద్రబాబు గారంట. మిమ్మల్ని పిలవమంటున్నారు," అంటూ నిర్లిప్తంగా చెప్పేసే పని కుర్రాడు రాజు, మిన్ను విరిగి మీద పడ్డా ఏమాత్రం చలించని వ్యాపార మరియు జీవిత భాగస్వామి, వీళ్ళతో తను ఎలా నెగ్గుకు వస్తున్నారో చెప్పారు సుశీల.

"ఇంతమంది మనవల్నెత్తిన ఈవిడ సోనీ బామ్మేమిటీ, తప్పు కదూ. కుక్కముండకి బామ్మలా కనిపిస్తున్నారా?" అంటూ పక్కింటి పిల్ల ఎదుట అత్తగారి పరువు నిలపడం ఎలాగో చెప్పడం మొదలు (మాయాబజార్), "మొన్నామధ్య మా చెల్లెలి కూతురు నేను పెట్టిన ఇడ్లీలు తింటూ చెప్పేదాకా నాకు తెలియదు, ఇడ్లీ పిండిలో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేస్తే రాళ్ళలా కాకుండా దూదుల్లా ఉంటాయని. ఆ పిల్లదానికి తెలిసిన విషయం కూడా నాకు తెలియలేదు. దాన్నే మరి, టెక్నాలజీ అంటారు" (నర్సిరెడ్డి చెరుకు తోట) లాంటి వంటింటి రహస్యాల వరకూ ఎన్ని సంగతులు చెప్పేశారో ఈ కథల్లో.

చిన్న పరిశ్రమల వాళ్ళని బ్యాంకుల వాళ్ళు, ఆర్డర్లు ఇచ్చే పెద్ద కంపెనీలు పెట్టే ఇబ్బందులనీ, అక్కడక్కడా జరిగే అవినీతినీ ఘాటుగా కాక, సరదాగా చెప్పారు. అయినప్పటికీ సంబంధీకులు భుజాలు తడుముకోక తప్పదు. చిన్నచేపలని మింగే పెద్ద చేపలు అన్ని చోట్లా ఉన్నట్టే, పరిశ్రమల రంగంలోనూ ఉన్నాయని చెప్పిన కథ 'స్పాన్సర్డ్ చప్పట్లు.' పరిశ్రమ నడపడంలో ఇబ్బందులని బరువుగానో, కోపం గానో కాక సరదాగా చెప్పడం ఈ కథల ప్రత్యేకత. సబ్జక్ట్ మీద ఏమాత్రం ఆసక్తి లేనివాళ్ళని సైతం ఆపకుండా చదివించే ఈ కథలని ఉమా బుక్స్ ప్రచురించింది. (వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

3 కామెంట్‌లు:

  1. murali garu susela garu namini prodbhalam too raasina kadhalavi.

    meeru namini gari gurinchi enduku rayaru? vari kadhala meeda mee review kosam edu chustuntam.

    రిప్లయితొలగించండి
  2. somaraju sushila gaaru is a versatile genius. a good story writer. murali gaaroo... mee review is simply superb!

    రిప్లయితొలగించండి
  3. @ఉష శ్రీ: తప్పకుండా రాస్తానండీ... ధన్యవాదాలు

    @భాస్కర్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి